దక్షిణ మధ్య రైల్వే 5,000 మెట్రిక్‌ టన్నులకు ఆక్సిజన్‌ను సరఫరా

మంగళవారం, 8 జూన్ 2021 (12:58 IST)
దక్షిణ మధ్య రైల్వే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు నిరంతరం వేగవంతంగా ఆక్సిజన్‌ సరఫరా చేస్తూ దేశ సేవలో కీలక పాత్ర పోషిస్తోంది. దక్షిణ మధ్య రైల్వే అనేక సవాళ్లను ఎదుర్కొంటూ 7 జూన్‌ 2021 తేదీ నాటికి రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌కు 5,045 మెట్రిక్‌ టన్నుల ద్రవ రూప వైద్య ఆక్సిజన్‌ను విజయవంతంగా సరఫరా చేసింది.

తెలంగాణ రాష్ట్రానికి 2,605 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 2,440 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓను సరఫరా చేసింది. రాష్ట్రానికి కావాల్సిన వైద్య ఆక్సిజన్‌ అవసరాలను తీర్చడానికి దేశంలోని తూర్పు మరియు పశ్చిమ ప్రాంతాల నుండి ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లు నడుపబడినాయి.

మొత్తం 66 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లలో 293 ట్యాంకర్లలో 5,045 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ లోడయ్యి తెలుగు రాష్ట్రాలకు వచ్చాయి. ఒడిస్సా నుండి 2,828 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ, జార్ఖండ్‌ నుండి 1,208 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ, గుజరాత్‌ నుండి 929 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ, మరియు పశ్చిమ బెంగాల్‌ నుండి 80 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా అయ్యింది. 

రైల్వే ద్వారా ఆయా రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్‌ సరఫరాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణపట్నం పోర్టు మరియు తాడిపాత్రి ప్రాంతాలకు మొత్తం మీద 2,440 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా కాగా, తెలంగాణలోని సనత్‌నగర్‌ గూడ్స్‌ కాంప్లెక్స్‌కు 2,605 మెట్రిక్‌ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ సరఫరా చేయబడిరది. 

రాష్ట్రాలకు కావాల్సిన ఆక్సిజన్‌ అవసరాలను  వీలైనంత త్వరాగా తీర్చడానికి  రైళ్లు తక్కువ సమయంలో  గమ్యం స్థానాలకు చేరేలా రైల్వే గ్రీన్‌ కారిడార్లను ఏర్పాటు చేసింది. ఆక్సిజన్‌ రైళ్లు వీలైనంత త్వరలా చేరేలా పర్యవేక్షణకు రైల్వేలో వివిధ విభాగాలలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది.  వీటి ఫలితంగా, ఈ రైళ్లు సగటను గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాయి. 

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ప్రణాళికబద్ధంగా ‘‘గ్రీన్‌ కారిడార్‌’’ పద్ధతిలో వేగవంతంగా వైద్య ఆక్సిజన్‌ సరఫరాకు కృషి చేసిన అధికారులను మరియు సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్య అభినందించారు.

రాష్ట్రాలకు వైద్య ఆక్సిజన్‌ సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈ రైళ్లను వీలైనంత వేగంగా నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ రైళ్ల నిర్వహణలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా ఇదే తరహ పర్యవేక్షణను ఇక మీదట కూడా కొనసాగించాలని ఆయన రైల్వే బృందాలకు సూచించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు