రాష్ట్రానికి తిరిగి కోలుకోలేనంత నష్టం కలిగింది: చంద్రబాబు

బుధవారం, 6 అక్టోబరు 2021 (20:13 IST)
రాష్ట్రంలో రెండున్నరేళ్లలో ఇంత అరాచకం, అప్రతిష్టపాలైన ప్రభుత్వం దేశ చరిత్రలో లేదని, అవినీతి, అరాచకం, అబద్ధాలలో తప్ప ప్రతి అంశంలోనూ సీఎం జగన్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు.

‘‘గడిచిన రెండున్నరేళ్లుగా రాష్ట్రమంతా విధ్వంసమే జరగుతోంది. ఎక్కడ చూసినా రాక్షసపాలన సాగుతోంది.  అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వ అసమర్థతను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు టీడీపీ పోరాడుతుంది.

కార్యాకర్తలు, నాయకులు ఐకమత్యంతో ముందుకు వెళ్లి పార్టీని గెలిపించాలి. ఎర్రకాలువ వరదలు వచ్చాయి. 4,500 ఎకరాల్లో పంట నష్టపోయింది. ప్రభుత్వం ఎలాంటి పరిహారమూ అందించలేదు. రైతులకు చాలా ఇబ్బందులు వచ్చాయి. ఇన్ పుట్ సబ్సీడీ, పంట నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. 30 శాతం పరిహారం ఇచ్చి మమ అనిపిస్తున్నారు.

పంట నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. పంటకు గిట్టుబాటు ధర లభించడం లేదు. వరి ధాన్యానికి కావాల్సిన ఇత్తనాలు కూడా సరిగా ఇవ్వనందున దిగుబడి కూడా తగ్గిపోయింది. టీడీపీ ప్రభుత్వంలో సీజన్ వచ్చేనాటికి రైతాంగానికి అవసరమైనవన్నీ అందించి అండగా నిలబడి రైతాంగాన్ని కాపాడాం. ఈ ప్రభుత్వ నిర్వాకం వల్ల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. 

సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండికెక్కింది. దున్నపోతు మీద వర్షం పడినట్లు ఏమాత్రం చలనం లేకుండా వ్యవహరిస్తున్నారు. జనం అవస్తలు పడుతుంటే తాడేపల్లి ప్యాలెస్ లో పడుకుని ఆనందం పొందుతున్నాడు. పైశాచిక ఆనందం తప్ప ప్రజల సమస్యలు, అభివృద్ధిపై ద్యాస లేదు.

జాతీయ రహదారులు తప్ప రాష్ట్రంలోని రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. రాష్ట్రాన్ని రిపేరు చేయాలంటే అందరూ సమిష్టిగా పనిచేయాలి. ఎవరూ అధైర్య పడాల్సిన పనిలేదు, ధైర్యంగా ముందుకు వెళ్లండి’’ అని చంద్రబాబు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు