సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి దూకిన రాజస్థాన్ వ్యక్తి... దాడిచేసి చంపేసిన సింహం.. ఎక్కడ?

ఠాగూర్

శుక్రవారం, 16 ఫిబ్రవరి 2024 (09:26 IST)
తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో గురువారం ఓ విషాదకర ఘటన జరిగింది. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన రాజస్థాన్ వ్యక్తిపై సింహం దాడి చేసింది. ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. సింహం అతడి మెడ కొరకడంతో తుదిశ్వాస విడిచాడు. మద్యంమత్తులోనే సెల్ఫీ కోసం అతడు సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి ఉండొచ్చని జూ అధికారులు చెబుతున్నారు. 
 
స్థానిక పోలీసులు, జూ క్యూరేటర్ తెలిపిన వివరాల మేరకు రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ప్రహ్లాద్ గుజ్జర్ గురువారం మధ్యాహ్నం జూకు వచ్చాడు. ఆ తర్వాత తాళం వేసివున్న మొదటి గేటు ఎక్కి సింహం ఎన్‌క్లోజర్ వద్దకు వెళ్లాడు. ఆ తర్వాత పక్కనే ఉన్న వాటర్ ట్యాంకు మీదుగా ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఈ క్రమలో అక్కడున్న సింహం అతడిని మెడపట్టి కొరికి చంపేసింది. జూ సిబ్బంది దీన్ని గమనించి రక్షించేందుకు వచ్చేలోపే ఈ దారుణం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. 
 
అయితే, గుజ్జర్ మద్యం తాగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతడి ఆధార్ కార్డు వివరాలతో కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ దుర్ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. జూ సందర్శన కోసం వచ్చిన పర్యాటకులు సైతం దిగ్భ్రాంతికు గురయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు