అమృత వర్షిణికి అసెంబ్లీ టికెట్ ఇవ్వండి కేసీఆర్ గారూ?: ఐలయ్య

బుధవారం, 19 సెప్టెంబరు 2018 (12:42 IST)
ప్రణయ్ పరువు హత్య కేసుపై విచారణ ముమ్మరంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మిర్యాలగూడ పరువు హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ సతీమణి అమృత వర్షిణికి టికెట్ ఇచ్చి ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని సీపీఎం, టీ-మాస్ ప్రతిపాదించాయి.


ప్రణయ్ నివాసంలో అమృతను కలిసి ఓదార్చిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీ-మాస్‌ చైర్మన్‌ కంచె ఐలయ్యలు, ఆమెను పోటీకి నిలిపితే ఏకగ్రీవం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ మేరకు ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ చొరవ చూపితే స్వాగతిస్తామని చెప్పారు. 
 
కుల దురహంకారానికి బలైన ప్రణయ్‌ హత్యకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ప్రణయ్‌పై దాడి ఘటనపై ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ స్పందించలేదన్నారు. హోంమంత్రి నాయిని, కేటీఆర్, జిల్లా మంత్రి జగదీశ్‌ రెడ్డిల్లో ఎవ్వరూ పరామర్శించడానికి రాలేదని కంచె ఐలయ్య ఆరోపించారు. ఆరోపణలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేతలను సస్పెండ్‌ చేస్తున్నట్లు జానారెడ్డి ప్రకటించారని గుర్తు చేశారు. 
 
అయితే ప్రణయ్ హత్యలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నకిరేకల్‌ ఎమ్మెల్యే వీరేశంను ఎందుకు సస్పెండ్‌ చేయలేదదని ఐలయ్య ప్రశ్నాస్త్రాలు సంధించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ఐలయ్య డిమాండ్‌ చేశారు.
 
ఇదిలా ఉంటే.. మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్యకు పాల్పడిన నిందితులను నల్గొండ ఎస్పీ రంగానాథ్ మీడియా ముందు ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు నెలల నుంచే ప్రణయ్ మర్డర్‌కు స్కెచ్ వేశారని చెప్పారు. జూలై మొదటి వారంలోనే ప్లాన్ వేశారని చెప్పారు. మారుతీరావు నుంచి రూ. 15 లక్షలు అడ్వాన్స్ తీసుకున్న తర్వాత అస్గర్ అలీ, అబ్దుల్ బారీ స్కెచ్ వేశారని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు