నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని మోసం చేసింది..

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (10:46 IST)
మిర్యాలగూడ పరువు హత్యలో ప్రాణాలు కోల్పోయిన ప్రణయ్‌ కేసు పట్ల పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఇప్పటికే అమృతవర్షిణి తల్లిదండ్రులపై ప్రణయ్ తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


ప్రణయ్ సోదరుడు అజయ్ కూడా అమృత తల్లి నమ్మక ద్రోహం చేసిందని.. తమతో కలిసివుండేలా నటించి తామెక్కడ వున్నామనే విషయాన్ని అమృత తండ్రికి చేరవేసేదని మండిపడ్డాడు. తాజాగా ప్రణయ్ తల్లి ప్రేమలత కూడా అమృత తల్లిపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
అమృత వర్షిణి తండ్రి మారుతీరావుతో పాటు తల్లి కూడా కలసి కుట్ర చేసి, తన బిడ్డను చంపించారని ప్రణయ్ తల్లి ప్రేమలత సంచలన ఆరోపణలు చేసింది. హత్యకు రెండు వారాల ముందు నుంచి అమృత వర్షిణికి ఫోన్ చేయడం ప్రారంభించిన ఆమె తల్లి, మెత్తగా, నమ్మకంగా మాట్లాడి, వారి గురించి ఆరా తీశారని మండిపడింది.

నల్లపూసల గొలుసు చేయించానని, కొత్త బట్టలు పంపుతానని చెబుతూ, వారు ఎక్కడికి వెళుతున్నారన్న వివరాలను సేకరించి, తన బిడ్డను పొట్టన పెట్టుకున్నారని ప్రేమలత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా అమృతను కూతురిలా చూసుకుంటామని.. ఇకపై అమృత మాతోనే వుంటుందని.. ఆమెను కన్నబిడ్డలా చూసుకుంటామని ప్రేమలత స్పష్టం చేసింది. 
 
వర్షిణి అంగీకరిస్తే ఆమెను తీసుకువెళ్లచ్చని తాము మారుతీరావుకు స్పష్టంగా చెప్పామని, కానీ తన కూతురుకు చీమైనా కుట్టకుండా చూసుకుని తన కొడుకును దారుణాతి దారుణంగా మారుతీరావు చంపించాడని ప్రణయ్ తండ్రి బాలస్వామి మండిపడ్డాడు. ప్రణయ్, అమృత హైస్కూల్ వయసులోనే ప్రేమించుకున్నారని, తనకు విషయం తెలిసి ప్రణయ్‌ని పలుమార్లు కొట్టానని చెప్పిన ఆయన, వారిద్దరూ పెళ్లి చేసుకుని వచ్చి కాళ్లపై పడి, వేడుకున్నారని కన్నీటి పర్యంతం అయ్యాడు. 
 
గత శుక్రవారం నాడు మిర్యాలగూడలో తన ఆసుపత్రి ముందు జరిగిన ప్రణయ్ పరువుహత్యను తలచుకున్న డాక్టర్ జ్యోతి కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటన జరగడానికి ఐదు నిమిషాల ముందు వరకూ ప్రణయ్, అమృత వర్షిణి తన వద్దే ఉన్నారని, గర్భవతిగా ఉన్న అమృతకు జాగ్రత్తలు చెప్పి, మళ్లీ పది రోజుల తరువాత రావాలని చెప్పి పంపానని అన్నారు.

కానీ కొన్ని నిమిషాల వ్యవధిలోనే ప్రణయ్‌ని ఎవరో పొడిచారని చెప్పింది. తానెళ్లి చూసి తిరిగొచ్చి చూసేలోపూ అమృత కూడా కిందపడి స్పృహ తప్పిపోయిందని.. డాక్టర్ జ్యోతి చెప్పారు. ప్రణయ్ చనిపోయాడనే విషయం మరుసటి రోజు వరకు చెప్పలేదని.. చికిత్స అందిస్తున్నట్లు చెప్తూ వచ్చానని జ్యోతి అన్నారు.
 
ప్రణయ్ హత్య సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటనగా జ్యోతి అభివర్ణించారు. దీన్ని అందరూ ఖండించాలని, భవిష్యత్తులో ఇంకెవరికీ ఇటువంటి పరిస్థితి ఎదురు కాకూడదని కోరుకుంటున్నానని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు