దేశాంతర ప్రేమపెళ్లి : గుంటుూరు అబ్బాయికి - టర్కీ అమ్మాయికి డుండుండుం

గురువారం, 30 డిశెంబరు 2021 (08:56 IST)
గుంటూరు అబ్బాయి - టర్కీ అమ్మాయి మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబ పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల సాక్షిగా దంపతులయ్యారు. ఈ దేశాంతర ప్రేమపెళ్లి కథ తాజాగా గుంటూరులో వెలుగులోకి వచ్చింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, టర్కీకి చెందిన గిజెమ్ అనే యువతి 2016లో ఓ ప్రాజెక్టు కోసం భారత్‌కు వచ్చింది. ఆ సమయంలో గుంటూరుకు చెందిన మధు సంకీర్త్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసే యువకుడుతో పరిచయమైంది. కొద్ది రోజుల తర్వాత మధు సంకీర్త్ కూడా ఉద్యోగ రీత్యా టర్కీకి వెళ్లాడు. దీంతో వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 
 
ఆ తర్వాత వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించి తమ మనసులోని మాటను తమతమ కుటుంబ సభ్యులకు వెల్లడించారు. ఇరు కుటుంబాల సభ్యులు కూడా ఈ దేశాంతర ప్రేమ పెళ్లికి సమ్మతించారు. నిజానికి వీరిద్దరి నిశ్చితార్థం గత 2019లోనే జరిగింది. కానీ, కరోనా మహమ్మారి కారణంగా పెళ్లి మాత్రం వాయిదాపడుతూ వచ్చింది. 
 
ఈ క్రమంలో వీరి వివాహం తొలుత టర్కీ అమ్మాయి తరపు వారి సంప్రదాయ మేరకు జూలైలో జరుపుకున్నారు. ఇపుడు గుంటూరులో హిందూ సంప్రదాయాల ప్రకారం ఒక్కటయ్యారు. ప్రస్తుతం మధు, గిజెమ్‌లు ఆస్ట్రియా దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారు. వీరిద్దరూ త్వరలోనే భారత్‌కు మకాం మార్చనున్నట్టు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు