జైలుకెళ్లిన వారు గెలుస్తున్నారు.. ఈ దఫా చంద్రబాబు గెలుస్తారు : ఉండవల్లి జోస్యం

వరుణ్

ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (18:52 IST)
జైలుకెళ్లి వచ్చిన వారు తప్పకుండా గెలుస్తున్నారని, ఈ కోవలోనే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తప్పకుండా గెలుస్తారని కాంగ్రెస్ మాజీ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ జోస్యం చెప్పారు. ఆయన ఆదివారం రాజమండ్రిలో మాట్లాడుతూ, జైలుకెళితే ఓడిపోతాననడం అర్థరహితమన్నారు. జైలుకు వెళ్లిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు. రాగానే గెలిచాడు. జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు.. గెలిచాడు. ఇవాళ చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు.. అందరూ అదే అంటున్నారు.. చంద్రబాబు కూడా జైలుకు వెళ్ళాడు.. గెలుస్తాడు అని అంటున్నారు. 
 
ఏపీకీ ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని, ఇపుడు జగన్ కూడా భయపడుతున్నారని అన్నారు. కేసుల భ యంతోనే వాళ్లు వెనుకంజ వేశారని తెలిపారు. రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చుకానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు. ఇపుడు కేసులు లేకుండా ఎవరు ఉన్నారని ఉండవల్లి ప్రశ్నించారు. 
 
ప్రపంచంలోకెల్లా నేనే నిజాయితీపరుడ్ని అని చెప్పే కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. ఢిల్లీలో ప్రైవేట్ స్కూళ్లలో ఎవరూ చేరకుండా, అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే పరిస్థితి తెచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేసేశారు. సిసోడియా ఢిల్లీలో ప్రభుత్వ రూపురేఖలనే మార్చేశారు. ప్రభుత్వ స్కూళ్ల వాతావరణాన్నే మార్చేశాడు. ఫ్యాకల్టీలనే మార్చేశాడు. అలాంటి వాడిపైనా కేసులు పెట్టారు. సిసోడియా జైలుకెళ్లి ఒక యేడాది అవుతోంది. ఆయనను బయటకు రానివ్వరు. ఇలా అందర్నీ ఏరతారు. దీనివల్ల నష్టమేంట? అని ప్రశ్నించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు