ఇద్దరు పిల్లల తండ్రి మగవాడు కాదా? పొట్టలో గర్భసంచి!.. హైదరాబాదులో వెలుగు చూసిన వైనం

శనివారం, 3 డిశెంబరు 2016 (11:05 IST)
అతడి వయసు 30 ఏళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూర్‌లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇంతవరకు పురుషుడిగా జీవిస్తున్న అతడిలో మహిళల అవయవాలూ ఉన్నాయని తెలిసింది. దీంతో అతడు ‘అతడే’నా? లేక ఆమెనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వైద్యులు పరీక్షలు చేశారు. 
 
శుక్రవారం గాంధీ ఆస్పత్రిలో ఈ అరుదైన కేసు వెలుగు చూసింది. పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ వ్యక్తి కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడు హెర్నియాతో బాధపడుతున్నట్లు నిర్ధారించారు. సర్జరీ చేయాలని సూచించడంతో గత నెల 23న ఆస్పత్రిలో చేరాడు. అన్ని పరీక్షలూ నిర్వహించి శుక్రవారం ఆపరేషన్‌ మొదలుపెట్టారు. 
 
కానీ అతడి కడుపులో గర్భసంచి, రెండు అండాలను పోలి ఉన్న అవయవాలను గుర్తించిన సర్జన్లు వెంటనే ఆండ్రాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ జగదీష్‌కి సమాచారం అందించారు. ఆయన వచ్చి, రోగిని పరీక్షించగా... ఆయన పొట్టలో మహిళలకు ఉండే అండాశయం, గర్భసంచిలు కనిపించాయి. పురుషులు వీటిని కలిగి ఉండటాన్ని ట్రూహెర్నాప్రోడీట్‍గా పిలుస్తామని వైద్యులు తెలిపారు. మళ్లీ ఓ ఆపరేషన్ నిర్వహించి వీటిని తొలగిస్తామని చెప్పారు. అతని వృషణాల సంచిలో ఉండాల్సిన వృషణాలు లేవని... ఆ సంచి ఖాళీగా ఉన్నదని, మహిళకు ఉండాల్సిన అన్ని రకాల హోర్మోన్లు అతని శరీరంలో ఉన్నాయని గుర్తించారు. 

వెబ్దునియా పై చదవండి