వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

ఠాగూర్

సోమవారం, 2 జూన్ 2025 (19:08 IST)
వివిధ కేసుల్లో అరెస్టయి విజయవాడ జైలులో ఉంటున్న వైకాపా మాజీ మంత్రి వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మూడు రోజుల పాటు చికిత్స తర్వాత వల్లభనేని వంశీని తిరిగి జైలుకు తరలించారు. ఆయన ఆరోగ్యంపై జూన్ 5వ తేదీన కోర్టుకు వైద్య నివేదిక సమర్పించనున్నారు. 
 
గత కొద్ది రోజులుగా వల్లభనేని వంశీ శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్న విషయంతెల్సిందే. దీంతో కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు మూడు రోజుల క్రితం విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యుల బృందం ఆయనకు ప్రత్యేక చికిత్స అందించారు. శ్వాస తీసుకోవడంలో ఉన్న ఇబ్బందులకు సంబంధించి అవసరమైన వైద్య సేవలు చేశారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సాధారణస్థితికి చేరుకుందని వైద్యులు నిర్ధారించారు. దీంతో సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు అనుమతించారు. కాగా, వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై సమగ్రమైన నివేదికను ఈ నెల 5వ తేదీన కోర్టుకు సమర్పించనున్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. 
 
వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ ప్రస్తుత విజయవాడ జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొన్ని కేసులకు సంబంధించిన లోతైన విచారణ నిమిత్తం పోలీసులు వల్లభనేని వంశీని కస్టడీకి తీసుకుని విచారించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆయన పలుమార్లు అస్వస్థతకు గురైన విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు