చేసుకోబోయే అమ్మాయి అతనితో మాట్లాడుతోందనీ.. పెట్రోల్ పోసి నిప్పంటించిన ఉన్మాది!

శుక్రవారం, 20 ఆగస్టు 2021 (11:26 IST)
విజయనగరం జిల్లాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. పెళ్లి చేసుకోబోయే అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. గురువారం రాత్రి జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
విజ‌య‌న‌గ‌రం జిల్లా పూస‌పాటిరేగ మండ‌లం చౌడువాడ‌కు చెందిన రాంబాబు అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతితో పెళ్లి జరిపించేలా పెద్దలు నిర్ణయించారు. అయితే, ఆ యువ‌తి మ‌రో యువ‌కుడితో మాట్లాడుతోంద‌ని రాంబాబు ఆగ్ర‌హంతో ఊగిపోయాడు. చివ‌ర‌కు  పెళ్లి ర‌ద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు.
 
దీంతో ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వ చెల‌రేగింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాల‌ను పిలిచి పోలీసులు రాజీ కుద‌ర్చ‌డంతో పోలీసుల సూచ‌న‌ల‌తో వివాహం చేసుకునేందుకు రాంబాబు అంగీకరించాడు. ఇంతలో ఏం జ‌రిగిందో తెలీదు.. నిన్న అర్థరాత్రి స‌మ‌యంలో యువ‌తిపై దారుణానికి పాల్ప‌డ్డాడు.
 
ఆ యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ యువ‌కుడిని అడ్డుకోబోయిన యువ‌తి అక్క, ఆమె కుమారుడికి కూడా గాయాలయ్యాయి. వెంట‌నే స్థానికులు బాధితులు ముగ్గురిని విజ‌య‌న‌గ‌రం జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు