సిగరెట్లు తీసుకురాలేదని.. డాబాపై నుంచి కిందకు తోసేసిన వలంటీర్..

శనివారం, 26 ఆగస్టు 2023 (12:18 IST)
ఏపీలో వలంటీర్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మొన్న ఒక వృద్ధురాలిని చంపేసిన వలంటీర్.. తాజాగా మరో బాలుడిని డాబాపై నుంచి కిందకు తోసేశాడు. కిరాణా షాకుపు వెళ్లి సిగరెట్లు తీసుకుని రాలేదన్న అక్కసుతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ వాలంటీర్ పేరు కళ్యాణ్ సతీష్ (23). ఈ దారుణం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలంలో జరిగింది. 
 
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, కణుపూరు గ్రామానికి చెందిన కల్యాణం సతీష్ (23) గ్రామ వాలంటీరుగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన తల్లోజు శశిధర్ (12) అనే ఏడో తరగతి విద్యార్థి ఈ నెల 11న రోడ్డుపై వెళ్తుండగా ఆపి.. తనకు సిగరెట్లు తెచ్చిపెట్టమని కోరాడు. బాలుడు వినకుండా వెళ్లిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న అతను.. అదేరోజు రాత్రి బుర్రకథ దగ్గర ఉన్న శశిధర్‌ను అక్కడే ఉన్న మరో విద్యార్థిని సరదాగా తిరిగి వద్దామంటూ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని ఊళ్లో సామిల్లు దగ్గర ఉన్న డాబా పైకి తీసుకువెళ్లాడు. 
 
అక్కడ అప్పటికే మద్యం సీసాలు, బజ్జీలు ఉన్నాయి. 'సిగరెట్లు తెమ్మంటే ఎందుకు తీసుకురాలేదు? నేనెవరో తెలుసా?' అంటూ శశిధర్‌ను చావబాదాడు. కొట్టొద్దంటూ మరో బాలుడు ప్రాధేయపడగా, ఇద్దరినీ కలిపి కొట్టాడు. ఇద్దరూ తప్పించుకోడానికి కిందికి దిగి వెళ్లిపోబోతుండగా శశిధర్‌ను వెనుక నుంచి గట్టిగా తన్నడంతో డాబాపై నుంచి రోడ్డుపై పడ్డాడు. ఇక్కడ జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ వారిని బెదిరించాడు. 
 
కొంతసేపటి తర్వాత శశిధర్‌ను తానే వాహనంపై కూర్చోబెట్టుకుని ఇంటికి తీసుకువెళ్లి దింపాడు. గుడి మెట్లు ఎక్కుతుండగా కిందపడితే తీసుకువచ్చానని అతడి తల్లిని నమ్మించాడు. తీవ్ర గాయాలైన బాలుడిని తల్లిదండ్రులు మర్నాడు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అప్పటికీ గాయాలు నయం కాకపోవడంతో మరో ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ శస్త్ర చికిత్స నిర్వహించాడు. ఆ తర్వాతగానీ ఆ బాలుడు అసలు విషయం చెప్పలేదు. దీంతో బాధితుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. వాలంటీర్‌ను అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు