నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేస్తాం: కృష్ణా జిల్లా కలెక్టర్

ఆదివారం, 29 నవంబరు 2020 (19:04 IST)
కృష్ణాజిల్లాలో నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్క రైతును ఆదుకొనేలా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ తెలిపారు. పెడన నియోజకవర్గంలోని నాలుగు మండలాలైన గూడూరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో పర్యటించి నివర్ తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పంటలను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు జోగి రమేష్, ఆర్డీఓ ఖాజావలితో కలసి కలెక్టర్ ఇంతియాజ్ దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ నివర్ తుఫాన్ వల్ల జిల్లాలో ఉన్న 53 మండలాల్లో 34 మండలాల్లో వరి పంట నీట మునిగి అపార నష్టం జరిగిందని, 10 రోజుల్లో కోతలు కోయవలసిన సమయానికి ఈ తుఫాన్ రైతులను నిండా ముంచి కోలుకోలేని దెబ్బతీసిందన్నారు.

దీని నిమిత్తం ముఖ్యమంత్రి వైయస్ జ‌గన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, వ్యవసాయ అధికారులు ఈ నెల 15వ తేదీ లోపు ఎన్యూమరేట్ చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంట ఇన్సూరెన్స్ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.

అదేవిధంగా 32 సంవత్సరాలుగా పూడికతో నిండిపోయిన లజ్జబండ డ్రైనేజ్ మరియు ఎక్కడైతే సరైన డ్రైనేజీ వ్యవస్థ సరిలేదో వాటి అభివృద్ధి కోసం ఇరిగేషన్ అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.

పెడన శాసనసభ సభ్యులు జోగి రమేష్ మాట్లాడుతూ ఆయా నాలుగు మండలాల్లో సుమారుగా 25 వేల హెక్టార్ల పంటనష్టం జరిగిందని, నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతును ముఖ్యమంత్రి ఆదుకుంటారని, అధికారులు పంట నష్టాన్నిఎన్యూమరేట్ చేసి రైతుతో పాటు కౌలు రైతుకు కూడా ఇన్‌పుట్ సబ్సిడీ మరియు ఇన్సూరెన్స్ అందేలా తీవ్ర కృషి చేస్తామన్నారు. పర్యటనలో తరకటూరు, చేవేండ్ర, ముంజులూరు, నీలిపూడి గ్రామ రైతలుతో జిల్లా కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు