నగలు వేసుకోవాలనుంది తీసుకురండి అన్నందుకు భార్యను చంపేశాడు

మంగళవారం, 13 ఏప్రియల్ 2021 (13:01 IST)
విజయవాడలోని గొల్లపూడిలో తుపాకీ మిస్ ఫైర్ అయిన ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో హోంగార్డే- భార్యపై కాల్పులు జరిపినట్లు దర్యాప్తు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ముఖ్యమంత్రి భద్రతా విభాగంలోని ఏఎస్పీ శశిభూషణ్ వద్ద హోంగార్డు వినోద్‌కుమార్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం శశిభూషణ్ అనంతపురం వెళ్లారు.

ఆ సమయంలో ఏఎస్పీ తుపాకీని హోంగార్డు వద్ద ఉంచారు. దాన్ని హోంగార్డు ఇంటికి తీసుకువచ్చాడు. మొదట ఇంట్లో తుపాకీ మిస్ ఫైర్ అయినట్లు హోంగార్డు చెప్పాడు. బుల్లెట్... అతడి భార్య సూర్యరత్నప్రభ గుండెల్లోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది.

ఆదివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భవానీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే భార్యను బెదిరించే క్రమంలోనే ఆ తుపాకీతో హోంగార్డు కాల్పులు జరిపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. బంగారు నగలు తాకట్టు పెట్టిన విషయంలో గత అర్ధరాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం కేసు విచారణలో ఉందని త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని పశ్చిమ మండల ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఘ‌ట‌నా స్థ‌లాన్ని న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. అనంత‌రం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీపీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. నిందితుడిని అరెస్టు చేసిన‌ట్లు తెలిపారు.

మ‌ణ‌ప్పురం ఫైనాన్స్‌లో తాక‌ట్టు పెట్టిన న‌గ‌లు విడిపించ‌మ‌ని భార్య ప‌దేప‌దే కోరుతున్న క్ర‌మంలో కొంత కాలంగా భార్య‌భర్త‌ల న‌డుమ గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆదివారం అర్థ‌రాత్రి జ‌రిగిన గొడ‌వ‌లో భార్య‌పై హోంగార్డు వినోద్‌కుమార్ తుపాకీతో కాల్పులు జ‌రిపి హ‌త్య గావించాడు. ఈ క్ర‌మంలో నిందితుడిని అరెస్టు చేసి స‌ర్వీస్ రివాల్వ‌ర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. విలేక‌రుల స‌మావేశంలో ప‌లువురు ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు