మరో ఆరు నెలలో పెళ్లి జరగాల్సిన యువతిపై కొందరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం జగిత్యాల జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్కు చెందిన 21 ఏళ్ల యువతికి ఈ నెల 21న వివాహం నిశ్చయమైంది. కుటుంబమంతా పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఈక్రమంలో పెళ్లిలో ధరించాల్సిన గాజులు, మెహందీ వంటి కొన్ని అలంకరణ వస్తువులు కొనుగోలు చేసేందుకు తల్లి కూతుళ్లు జగిత్యాలకు వెళ్లారు.
అయితే చెరో పని మీద వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తల్లి కొత్త బస్టాండ్ సమీపంలో వాహనం దిగింది. యువతి పాత బస్టాండ్ వరకు వెళ్లి తన స్నేహితురాళ్లకు పెళ్లి శుభలేఖలు అందజేసింది. అనంతరం షాపింగ్ ముగించుకుని ఆటోలో ఇంటికి బయలుదేరింది. ఆటోలో ఎక్కిన మరో ఇద్దరు వ్యక్తులు మత్తు ద్వారా యువతి స్పృహ కోల్పోయేలా చేశారు.
అనంతరం ఆమె ఒంటి మీద ఉన్న బంగారు నగలు కాజేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత రాత్రి సమయంలో కొండగట్టు వద్ద వదిలి పారిపోయారు. శుక్రవారం స్పృహలోకి వచ్చిన యువతి.. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్తో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందుతుల కోసం గాలిస్తున్నారు.