కొంతమంది యువతులు డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కుతుంటారు. మరికొందరు మోసాలకు పాల్పడుతుంటారు. కానీ, హైదరాబాద్కు చెందిన ఓ యువతి తనకు కేన్సర్ సోకిందని చికిత్స కోసం డబ్బులు సాయం చేయండంటూ ఫేస్బుక్లో పోస్టింగ్స్ చేసింది. దీన్ని నమ్మిన ఆమె ఫ్రెండ్స్ ఏకంగా రూ.30 లక్షల వరకు డబ్బు ఇచ్చారు. ఇలా డబ్బులిచ్చిన ఆమె బంధువులు యువతిని చూసేందుకు ఆస్పత్రికి రాగా అసలు విషయం బయటపడింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
సైదాబాద్కు చెందిన సమియా అనే యువతి డిగ్రీ పూర్తి చేసి ఇంట్లో ఖాళీగా ఉంటోంది. ఆమె తండ్రి హుస్సేన్ సౌదీ అరేబియాలో సేల్స్మెన్గా పనిచేస్తున్నాడు. తరచూ సమియా తండ్రి వద్దకు వెళ్లి నెలల కొద్ది అక్కడే ఉండి నగరానికి తిరిగి వస్తుంటుంది. రెండు సంవత్సరాల క్రితం హుస్సేన్కు కేన్సర్ రావడంతో సమియా అక్కడే ఉండిపోయింది. తండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో అనేక మంది వైద్యులతో పాటు.. సిబ్బందితో పరిచయం ఏర్పడింది. దీంతో వారితో ఫోటోలు, సెల్ఫీలు తీయించుకుంది.
ఈనేపథ్యంలో రెండు నెలల క్రితం సౌదీ నుంచి తిరిగి వచ్చిన సమియా బంజారాహిల్స్లోని ఓమేగా ఆసుపత్రి ఎండీ వంశీమోహన్ను కలిసింది. తన తండ్రికి ఉన్న రోగం గురించి చెప్పింది. చికిత్సకు ఎంత ఖర్చు అవుతుందని అడిగింది. రోగిని పరీక్షించాక చెబుతానని మోహన్ వంశీ బదులిచ్చారు. ఈ సమయంలో కొన్ని వైద్యుడితో సెల్ఫీలు తీసుకుంది.
తాను కేన్సర్ బారిన పడినట్టు ఫేస్బుక్లో ఫొటోలను అప్లోడ్ చేసింది. డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నా అంటూ తన స్నేహితులను నమ్మించింది. దీంతో ఆమె బంధువులతో పాటు స్నేహితులు స్పందించి డబ్బు పంపించారు. ఇలా మొత్తం రూ.30 లక్షల మేరకు వసూలైంది. అలాగే, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ పడ్డాయి.
గత నెలలో తనకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారని ఫెస్బుక్లో పోస్టు చేసింది. దీంతో సౌదీకి చెందిన ఇద్దరు స్నేహితులు ఆమెను పరామర్శించేందుకు నగరానికి వచ్చి ఆస్పత్రికి వెళ్లి ఆరా తీసింది. దీంతో అసలు విషయం బయటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఆస్పత్రి ఎండీ ఆ యువతిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఫలితంగా కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు ఆ యువతిని అరెస్టు చేశారు.