నల్గొండలో మరో స్వాతి : ప్రియుడి మోజులో భ‌ర్తనే క‌డ‌తేర్చింది...

మంగళవారం, 2 జనవరి 2018 (10:21 IST)
నల్గొండ జిల్లాలో మరో స్వాతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులోపడి భర్తనే కడతేర్చిందో మహిళ. ఈ దారుణం డిసెంబరు 28 అర్థరాత్రి న‌ల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చెన్నారం గ్రామపంచాయతీ ఏపూరు తండాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ఏపూరు తండాకు చెందిన రమావత్‌ సోమ(33)కు భార్య భారతి, కుమారుడు మహేష్‌ ఉన్నారు. వీరంతా కలిసి తండాలో జీవనం సాగిస్తున్నారు. అయితే, గత కొంతకాలంగా అదే తండాకు చెందిన వరుసకు బావ అయ్యే రమావత్‌ శివ అనే వ్యక్తితో భారతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన సోమా పలుమార్లు భార్యను మందలించాడు. అయినప్పటికీ భారతి ప్రవర్తనలో మార్పు రాలేదు. 
 
వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని భావించిన భారతి, అతన్ని హత్య చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ క్రమంలో డిసెంబర్‌ 28 రాత్రి మద్యం మత్తులో ఉన్న సోమ భార్య, కుమారుడితో గొడవ పడి నిద్రపోయారు. ఇదే అదనుగా భావించిన భారతి ప్రియుడు శివకు ఫోన్‌ చేసి ఇంటికి రమ్మంది. సోమా, కుమారుడు మహేష్‌ నిద్రపోతుండగా, ఎలాంటి చప్పుడు లేకుండా భారతి, ప్రియుడు శివ ఇద్దరూ కలిసి హత్య చేశారు. 
 
మంచంపై నిద్రపోయిన సోమాను శివ గట్టిగా గొంతు నులమగా, భారతి భర్త సోమా ముఖంపై బొంతను వేసి ఊపిరి ఆడకుండా చేయడంతో సోమా అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసుల విచారణలో నిందితులు ఈ మేరకు నేరాన్ని అంగీకరించారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఇటీవల నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో కూడా స్వాతి అనే మహిళ తన భర్త సుధాకర్ రెడ్డిని ప్రియుడి సాయంతో హత్య చేసిన విషయం తెల్సిందే. ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు