ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతెవాడ సరిహద్దుల్లో సోమవారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళా మావోయిస్టు శాఖమూరి రేణుక అలియాస్ భాను అలియాస్ చైతే అలియాస్ సరస్వతి అలియాస్ దమయంతి ప్రాణాలు కోల్పోయింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు దివంగత శాఖమూరి అప్పారావు భార్య. మావోయిస్టు పార్టీ దండకారాణ్య స్పెషల్ జోనల్ సభ్యురాలిగా రేణుక పనిచేశారు.
కాగా, రేణుకపై తెలంగాణాలో రూ.20 లక్షలు, ఛత్తీస్గఢ్లో రూ.25 లక్షలు రివార్డులు ఉన్నాయి. బీజాపూర్, దంతెవాడ సరిహద్దుల్లోని ఇకేలీ బెలీనార్ అడవుల్లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ కాల్పుల్లో రేణుక ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలం నుంచి ఇన్సాస్ రైఫిల్, పేలుడు పదార్థాలు, ల్యాప్టాప్, ఇతర వస్తువులను బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.