గత వైకాపా ప్రభుత్వ హయాంలో అనేక మంది వైకాపా నేతలు తమ నోటికి పని చెప్పారు. చేతిలో అధికారం ఉన్నప్పటికీ ప్రజలకు మంచి చేసిన పాపాన పోలేదనే విమర్శలు లేకపోలేదు. బూతు పదజాలంతో నిత్యం వార్తల్లో నిలిచారు. అలాంటి వారిలో వైకాపా మాజీ మంత్రి విడదల రజని ఒకరు. చిలకలూరిపేట నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా ఇన్చార్జ్ పిల్లికోటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిపై అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. అప్పటి పట్టణ సీఐ సూర్యనారాయణ తనను హింసించి వీడియో కాల్ ద్వారా రజనికి చూపించారని, ఈ వ్యవహారంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడదల రజనీతో పాటు ఆమె పీఏలో నాగిశెట్టి జయ ఫణీంద్ర, రామకృష్ణలకు అరెస్టు భయం పట్టుకుంది. దీంతో వారు కోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
వాట్సాప్ కాల్ ద్వార తనను దూషించినట్టు కోటి తన ఫిర్యాదులో పేర్కొన్నారని, అందువల్ల ఇది చెల్లదని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో పిటిషన్పై నాలుగు కేసులు ఉన్నట్టు కోర్టుకు తెలిపారు. ఈ కేసుల్లో తమపై ఒత్తిడి తీసుకొచ్చి రాజీ కుదుర్చుకునే ఉద్దేశంతోనే తమపై తప్పుడు ఫిర్యాదు చేశారని రజనీ కోర్టుకు తెలిపారు. పైగా ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉందని, అందువల్ల తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారు తమ తమ పిటిషన్లలో పేర్కొన్నారు.