వైసీపీ అధినేతగా జగన్ ఏకగ్రీవం.. చంద్రబాబు అంత అవినీతిపరుడు దేశంలో లేడు...

ఆదివారం, 9 జులై 2017 (15:55 IST)
వైఎస్సార్సీపీ జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఓ ప్రకటన చేశారు. పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఎన్నికైన సందర్భంగా ఆయన్ని పార్టీ నేతలు అభినందించారు. అనంతరం, పార్టీ అభిమానులు అందించిన శంఖాన్ని జగన్ పూరించారు. 
 
అంతకుముందు, జగన్ కు తలపాగా పెట్టేందుకు ప్రయత్నించిన తమ పార్టీ నాయకుడి చేతుల్లో నుంచి దానిని తీసుకున్న ఆయన తలకే జగన్ పెట్టడం గమనార్హం. మరో నేత ధనుర్బాణలను అందించగా.. జగన్ వాటిని చేతబట్టగా అభిమానుల చప్పట్టు మార్మోగిపోయాయి. 
 
ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు పాలనపై సమరశంఖం పూరించామని, ఆయన గుండెల్లో ఈపాటికే రైళ్లు పరిగెత్తి ఉంటాయని అన్నారు. గుంటూరులో జరుగుతున్న వైఎస్సార్సీపీ ప్లీనరీ ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ స్థాపించి ఆరేళ్లయిందని, కష్టసుఖాల్లో తమతో పాలు పంచుకున్న వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. 
 
ఈ ఆరేళ్ల పోరాటంలో ధైర్యంగా పాలుపంచుకుంటున్న వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు. ఈ ప్లీనరీలో 20 అంశాలపై చర్చించామని అన్నారు. 2014లో తాను మారిపోయానని చంద్రబాబు అన్నారని, మూడేళ్లుగా ప్రజల నెత్తిన చెయ్యి పెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ఆయన అంత అవినీతిపరుడు దేశంలో ఎక్కడా లేడని, బాబు పాలన అంతా అవినీతిమయేమంటూ జగన్ ధ్వజమెత్తారు. 

వెబ్దునియా పై చదవండి