మీతో ఏం మాట్లాడినా.... బయటకు వెళ్లిపోతుంది... ఇక్కడేమీ మాట్లాడొద్దు.. సీఎం

శనివారం, 4 నవంబరు 2023 (10:57 IST)
ఏపీ మంత్రి వర్గ సమావేశం శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఇందులో అన్ని శాఖల మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. 'మీతో ఏం మాట్లాడినా... బయటకు వెళ్లాక మీరు ఎవరికో (మీడియానుద్దేశించి) ఒకరికి చెప్పేస్తున్నారు. ఇక్కడ మాట్లాడుకోవడం ఎందుకులే' అని మంత్రులతో సీఎం జగన్ అన్నట్లు సమాచారం. 
 
సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో సాధారణంగా మంత్రిమండలి ఎజెండా అంశాలపై చర్చ తర్వాత అధికారులను పంపేసి.. మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ కొనసాగించడం ఆనవాయితీగా వస్తుంది. మంత్రులతో అప్పుడు ప్రభుత్వపరంగా చేస్తున్న కార్యక్రమాలు, వాటికి వస్తున్న స్పందన, ప్రతిపక్షాల విమర్శలు, వాటిని ఎలా ఎదుర్కోవాలి, పార్టీపరంగా మంత్రులకు బాధ్యతలు అప్పగించడం వంటివాటిపై సీఎం మాట్లాడుతూ, వారి అభిప్రాయాలను తీసుకుంటుంటారు. 
 
కానీ, శుక్రవారం నాటి భేటీలో మాత్రం ఈ చర్చ ఏమీ వద్దని చెప్పి సీఎం సమావేశం ముగించుకుని వెళ్లిపోయినట్లు తెలిసింది. ఎజెండాపై చర్చ సందర్భంగా వైకాపా నిర్వహిస్తున్న సామాజిక సాధికార బస్సుయాత్ర గురించి ప్రస్తావనకు రాగా, ఈ యాత్ర బాగా జరుగుతోందని సీఎం అనగా.. అవునంటూ మంత్రులు స్పందించారు. జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలపడంతో.. పలువురు మంత్రులు సీఎంను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు