ప్రాణం విలువ నాకంటే బాగా తెలిసినవారు లేరు : సీఎం జగన్

గురువారం, 20 మే 2021 (14:51 IST)
తనకు ప్రాణం విలువు బాగా తెలుసని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చనిపోయినప్పుడు.. ఓదార్పుయాత్ర చేసి ప్రతి కుటుంబాన్ని పరామర్శించినట్టు చెప్పారు. 
 
రెండేళ్లలో ప్రతి ఒక్కరినీ దృష్టిలో ఉంచుకుని అడుగులు వేశామన్నారు. గ్రామాల్లో వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని ప్రకటించారు. ప్రతి 2 వేల మంది జనాభాకు ఒక ఏఎన్‌ఎంను నియమించామన్నారు. ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లో అంబులెన్స్‌ వచ్చేలా మార్పులు చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, ప్రాణం విలువ తెలుసుకాబట్టే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నామని ప్రకటించారు.
 
ముఖ్యంగా, 'ఒకేసారి 1180 అంబులెన్స్‌లను ప్రారంభించాం. ఏపీలో ప్రతిరోజు లక్ష కరోనా టెస్టులు చేస్తున్నాం. నాడు - నేడు కార్యక్రమంతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చాం. ప్రపంచానికే కొవిడ్‌ పెద్ద సవాల్‌గా మారింది. గత ఏడాది మార్చిలో ఏపీలో తొలి కేసు నమోదైంది. అప్పట్లో శాంపిల్స్‌ పుణె పంపాల్సిన పరిస్థితులు ఉండేవి.. ఇప్పుడు ఏపీలో 150కి పైగా ల్యాబ్‌లను అందుబాటులోకి తెచ్చాం. 
 
తొలి వేవ్‌లో 261 ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తే.. సెకండ్‌ వేవ్‌లో 649 ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్నాం. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలు మనకు లేవు. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల సేవలు రాష్ట్రంలో లేవు. కొవిడ్‌ నియంత్రణకు 2,229 కోట్లు ఖర్చు చేశాం. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సను కూడా ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చాం' అని జగన్ చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు