సీఎం జగన్ సీరియస్ : ఎంపీ రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు??

సోమవారం, 15 జూన్ 2020 (18:56 IST)
వైకాపాకు చెందిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు పట్ల ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అలాగే ఆయనకు షోకాజ్ నోటీసు పంపించాలని వైకాపా అధిష్టానం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 
 
వైకాపా యేడాది పాలనపై రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ, వైసీపీ ఏడాది పాలనలో కులరాజకీయం, అవినీతి, ఇసుక, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. 
 
ఈ వ్యాఖ్యలపై వైకాపా ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు. పైపెచ్చు... ఆయనపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో రఘురామకృష్ణంరాజుపై క్రమశిక్షణా చర్యలకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 
 
షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చెయ్యడానికి కూడా వెనకాడబోమన్న సంకేతాలు ఇచ్చారని.. అధికార పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఇదిలావుంటే, ఎంపీ రఘురామరాజుపై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెంటనే స్పందించిన ఆయన.. తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని, అయితే పార్టీలోకి తనకు తానుగా రాలేదని, కాళ్లావేళ్లా బతిమిలాడితే వచ్చానని చెప్పుకొచ్చారు. 
 
మంచిదో, చెడ్డదో నిర్ణయం తీసుకోవలసి వచ్చిందన్నారు. అంతకుముందు అడిగితే ఛీ కొట్టిన విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు. తన కర్మో, వాళ్ల కర్మో పక్కన పెడితే తాను కాబట్టే నరసాపురం ఎంపీ సీటు వైసీపీ సొంతమైందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే.. ఆయా కులాలకు చెందిన వారితో విమర్శలు చేయిస్తారని ఇది వైసీపీ సాంప్రదాయమని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు