అసెంబ్లీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.. ప్రతిపక్ష హోదా ఇవ్వండి

సెల్వి

మంగళవారం, 25 జూన్ 2024 (16:13 IST)
ఏపీలో కూటమి సర్కార్, స్పీకర్ తనపై శత్రుత్వం ప్రదర్శిస్తున్నారని వైకాపా అధినేత జగన్ వాపోయారు. తమ పార్టీ కార్యాలయాలను లక్ష్యంగా టీడీపీ విధ్వంసం సృష్టిస్తోందని జగన్ ఆరోపించారు. 
 
ప్రతిపక్ష హోదాకు 10 శాతం సీట్లు ఉండాలని ఎక్కడా లేదని తెలిపారు. అటు పార్లమెంటులో గానీ.. ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ ఈ నిబంధనను ఇప్పటిదాకా ఎప్పుడూ పాటించలేదని గుర్తుచేశారు. 
 
విపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని సూచించారు. మంత్రుల తర్వాత తనతో ప్రమాణం చేయించడం సంప్రదాయాలకు విరుద్ధమని వైఎస్‌ జగన్‌ అన్నారు. అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితి కనిపించడం లేదని.. ప్రతిపక్ష హోదాతోనే సమస్యలను వినిపించే అవకాశం ఉందని జగన్ స్పష్టం చేశారు. ఈ అంశాలను స్పీకర్‌ దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు.
 
"ప్రతిపక్షంలో ఎక్కువ సీట్లు ఉన్నవారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10 శాతం సీట్లు తప్పనిసరి అని చట్టంలో ఎక్కడా చెప్పలేదు" అని ఆ లేఖలో జగన్ రాశారు. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుంది. 
 
ప్రతిపక్ష హోదాతో సభా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు న్యాయపరమైన భాగస్వామ్యం లభిస్తుంది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని మీరు ఈ లేఖను పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తున్నాను" అని జగన్ తెలిపారు. 
 
గతంలో కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తా.. అంటూ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు