జగనన్న ఎవరికి పులి... వంగి వంగి దండాలు పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లారు : వైఎస్ షర్మిల

ఠాగూర్

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2024 (08:56 IST)
తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. "జగనన్నను పులి, సింహం అని పొగుడుతున్నారు ఎవరికి పులి.. ఎవరికి సింహం..? సాక్షి పేపర్‌‍కి పులినా..? ఆయన సోషల్ మీడియాకి సింహమా..? ఒక్కసారి బీజేపీ మీద విప్పండి మీ పంజా... ఒక్కసారి బీజేపీపై దమ్ముంటే గాండ్రించండి. ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు. సొంత ఆడబిడ్డ మీద బూతులు మాట్లాడుతున్నారు. బజారుకు ఈడ్చుతున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తున్నారు. వైసీపీకి సాధ్యమైంది ఇదే. రాష్ట్ర ప్రయోజనాలు సాధించుకోవడం చేతకాదు అంటూ విమర్శలు గుప్పించారు. 
 
అలాగే, ఇది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ. గతంలో డీఎస్సీ గురించి ఎద్దేవా చేసిన జగనన్న మెగా డీఎస్సీ ఇస్తామన్నారు. ఇప్పుడు ఆరు వేల ఉద్యోగాలతో దగా డీఎస్సీ ఇచ్చారు. నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం. మెగా డీఎస్సీ కోసం స్వయంగా నేను సచివాలయ ముట్టడి చేస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్‌పైనే తొలిసంతకం ఉంటుందని హామీ ఇస్తున్నా అని పేర్కొన్నారు. 
 
పదేళ్లుగా మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ కూడా సాధించుకోలేకపోయాము. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకునిగా ఎన్నో ఉద్యమాలు చేసిన జగనన్న.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యమం కూడా చేయలేదు. బీజేపీకి చంద్రబాబు, జగనన్న తొత్తులుగా మారారు. ఇద్దరూ ఢిల్లీ వెళ్లి బీజేపీకి సాష్టాంగ నమస్కారం చేస్తారు. ఒకరు ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకుంటే, మరొకరు పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు. ఒకవైపు జగన్‌తో మరోవైపు చంద్రబాబుతో బీజేపీ డ్యాన్సులు చేస్తోంది. డ్యూయట్లు పాడుతుందని ఆరోపించారు. 
 
భూ హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తీసుకురావాలని చూస్తుంది. ఇప్పటికే లిక్కర్‌ను బిజినెస్ చేసి.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారు. ఇప్పుడు భూహక్కుల పేరిట కొత్త చట్టంతో భూ కబ్జాలు కూడా సర్కార్ చేయబోతుంది. లిక్కర్ వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్నట్లు... ప్రజల భూములను కూడా గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది వైసీపీ సర్కార్. ఇలాంటి దారుణమైన చట్టాలు తెచ్చే వైసీపీ ప్రభుత్వం మళ్ళీ రావాలో లేదో ప్రజలే తేల్చుకోవాలి. లాండ్ టైటిల్ యాక్ట్‌‍ను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు. 
 
కాగా, దెందులూరులో జరిగిన భారీ బహిరంగ సభకు తరలివచ్చి, ఘన స్వాగతం పలికిన నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు. నాకు మద్దతు తెలిపిన ప్రతిఒక్కరికీ రుణపడి ఉంటా.జగనన్న, చంద్రబాబు ఇద్దరు బీజేపీతో డ్యూయెట్ లు పాడుతున్నారు.రాష్ట్రానికి విభజన హామీలు గాలికొదిలేసి బీజేపీకి సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్ పైనే తొలిసంతకం ఉంటుందని హామీ ఇస్తున్నట్టు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు