వర్షపు నీరు లీకుపై స్పీకర్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి: బొత్స

గురువారం, 8 జూన్ 2017 (19:17 IST)
అమరావతి అసెంబ్లీలో విపక్షనేత జగన్ మోహన్ రెడ్డి కార్యాలయంలో వర్షపు నీరు లీకుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని వైకాపా నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఒక్క వర్షానికే అసెంబ్లీ నిర్మాణంలోని డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ చదరపు అడుగు నిర్మాణానికి రూ.2 వేలకు బదులు రూ.9 వేలు ఇచ్చి... భారీ అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వర్షపు నీరు లీకవడంపై స్పీకర్ వ్యాఖ్యలకు, సీఆర్డీఏ కమిషనర్ వ్యాఖ్యలకు పొంతనే లేదని మండిపడ్డారు. కేవలం జగన్ ఛాంబర్‌కే విచారణను పరిమితం చేస్తున్నారని... బిల్డింగ్‌లో జరిగిన మొత్తం లీకులపై దర్యాప్తుకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. 
 
అసెంబ్లీ, సచివాలయంలో కారింది వర్షపు నీరు కాదని, టీడీపీ అవినీతి అని ఆ పార్టీకి చెందిన మరో నేత అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. సీఎం చంద్రబాబు ఛాంబర్‌కు బుల్లెట్ ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్.. ప్రతిపక్ష నేత జగన్ ఛాంబర్‌కు మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ఆయన మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే జగన్ ఛాంబర్ వర్షపు నీటి మయమైందని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి