రేవంత్ రెడ్డి కాస్త కోవర్ట్ రేడ్డిగా మారిపోయారు : ఎమ్మెల్యే రోజా కౌంటర్

శుక్రవారం, 9 జులై 2021 (11:26 IST)
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసిన వ్యాఖ్యలకు ఏపీలోని అధికార వైకాపా ఎమ్మెల్యే రోజా గట్టిగా కౌంటరిచ్చారు. రైతులను దగాచేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు పార్టీయేనని దుయ్యబట్టారు. 
 
దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రేతుదినోత్సవంగా జరుపుకున్నామని, రాజశేఖర్ రెడ్డి అంటే రైతు రాజ్యంగా పేరు పొందిందని రోజా అన్నారు. ఆయన తనయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా రైతు రాజ్యంగా పాలన సాగిస్తున్నారని ఆమె కొనియాడాడు. 
 
నకిలీ విత్తనాలతో చంద్రబాబు రైతులని మోసం చేశారు.. కానీ, సీఎం జగన్ అగ్రీ లాబ్ ప్రారంభించి నాణ్యమైన విత్తనాలను అందజేస్తున్నారని గుర్తుచేశారు. రైతుల ప్రయోజనాల కోసం సీఎం జగన్ ఎంతకైన తెగిస్తారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు జలవివాదాలే లేవని లోకేష్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
 
అంతేకాదు, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక‌ కోవర్ట్ రెడ్డి అని ఘాటైన విమర్శలు గుప్పించారు. మా ఇంట్లో సీఎం కేసీఆర్, జగన్‌ల మంతనాలు జరిగాయని రేవంత్ రెడ్డి అంటున్నారనీ, జగన్ మా ఇంటికి ఎప్పుడు వచ్చాడో రేవంత్ రెడ్డి నిరూపించాలని’ ఎమ్మెల్యే రోజా సవాల్ విసిరారు. 
 
కేసీఆర్ దైవ దర్శనం కోసం తమిళనాడుకు వెళ్తూ మార్గం మధ్యలో ఉన్న మా ఇంటికి వచ్చారే తప్ప ఎలాంటి మంతనాలు జరపలేదని స్పష్టం చేశారు. ఆయన రేవంత్ రెడ్డా, కోవర్ట్ రెడ్డో ముందు చెప్పాలని అన్నారు. పచ్చ మీడియాతో కలిసి రేవంత్ రెడ్డి చేస్తున్న రాజకీయం చూస్తుంటే రేవంత్ రెడ్డి ఒక కోవర్ట్ రెడ్డి అని అర్థమవుతోందని ఆర్కే. రోజా విరుచుకుపడ్డారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు