సీఎం జగన్‌కు రఘురామ పదో లేఖ ... విజయసాయికి కళ్లెం వేయకుంటే..

శనివారం, 19 జూన్ 2021 (10:45 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వైకాపా రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు 10వ లేఖను రాశారు. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం ఆలయం విషయంలో అశోక్ గజపతి రాజు కేసు గెలిచారని లేఖలో రఘురామ పేర్కొన్నారు. 
 
ఉత్తరాంధ్ర ప్రతినిధి విజయసాయిరెడ్డి నిరంతరం ఆరోపణలు చేస్తున్నారన్నారు. విజయసాయి రెడ్డిని కట్టడి చేయాలని లేకపోతే పార్టీకి నష్టం చేకూరుతుందని లేఖలో రఘురామ పేర్కొన్నారు. 
 
విజయసాయి రెడ్డిని, మంత్రులను పార్టీ మంచి కొరకు నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల్లో దాగున్న భావోద్వేగం వెల్లువెత్తి 2014 పరిస్థితులు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానని రఘురామ కోరారు. 
 
మరోవైపు, అశోక్‌గజపతి రాజుపై ఫోర్జరీ కేసు ఉందని, త్వరలోనే ఆయన జైలుకు వెళ్లనున్నారని వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అశోక్‌గజపతి మాన్సాస్‌ ట్రస్టుకు మాత్రమే చైర్మన్‌ అని, విజయనగరం జిల్లాకు రాజు కాదని అన్నారు. ఆయన వందల ఎకరాలు దోచుకున్నారని, వాటన్నింటిపైనా విచారణ జరిపిస్తున్నామని చెప్పారు. 
 
సింహాచలం దేవస్థానం, మాన్సాస్‌ ట్రస్టు కేసుల్లో హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై తాము అప్పీల్‌కు వెళుతున్నామని చెప్పారు. అధికార నియామకాల్లో లింగ భేదం చెల్లదని సుప్రీంకోర్టు ఇచ్చినా, సంచయిత నియామకం చెల్లదంటూ కోర్టుకు వెళ్లిన ఆయనకు మహిళలపై గౌరవం లేదన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు