2019 ఎన్నికలకు తర్వాత బీజేపీలో వైకాపాను జగన్మోహన్ రెడ్డి విలీనం చేస్తారా?

ఆదివారం, 19 మార్చి 2017 (15:23 IST)
ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నట్లు రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. ఏపీలో బలపడేందుకు బీజేపీ సర్వం సిద్ధం చేసుకుంటుంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ, పవన్ పార్టీలు 2019 ఎన్నికల్లో గెలుపు దిశగా చర్యలు చేపడుతుంటే.. బీజేపీ మాత్రం ఏపీలో తన సత్తా చాటేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేతులు కలుపనుందని సమాచారం. 
 
అవినీతి కేసుల్లో చిక్కుకున్న జగన్‌కు అభయహస్తం ఇచ్చి.. ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా కేసుల నుంచి తనను విముక్తుడ్ని చేస్తే.. బీజేపీతో చేతులు కలిపేందుకు సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కేసుల నుంచి విముక్తి పొందాలంటే జగన్ తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని బీజేపీ షరతులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది. 
 
ఇందుకు ఓకే చెప్పిన జగన్ వచ్చే ఎన్నికల తర్వాత పార్టీని విలీనం చేస్తానని, ఎన్నికల ముందు చేస్తే తనకు మద్దతుగా ఉన్న ముస్లింలు, క్రైస్తవులు దూరమై నష్టపోతామని జగన్ అండ్ టీమ్ బీజేపీ అధిష్టానానికి విన్నవించినట్లు సమాచారం.
 
ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్‌తో ఇలాంటి ప్రయత్నానికి ప్లాన్ చేసినప్పటికీ.. 2014 ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమితో జగన్ ఆ ప్రతిపాదనకు నో చెప్పేశారు. అయితే ఏపీలో మనుగడ కోసం తన పార్టీని బీజేపీలో విలీనం చేయక తప్పదని జగన్ భావిస్తున్నట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి