కోవిడ్‌-19 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ 10 అంబులెన్సులు, 4000 పీపీఈ కిట్లు విరాళం

బుధవారం, 14 అక్టోబరు 2020 (17:03 IST)
మీడియా ఎంటర్టైన్మెంట్ పవర్‌హౌస్‌ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (జీ), కోవిడ్-19కు వ్యతిరేకంగా తమ జాతీయ కార్పోరేట్‌ సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అధికారికంగా 10 అంబులెన్సులు, 4,000 పీపీఈ కిట్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నేడు అందించింది. రవాణా, ఐ అండ్ పిఆర్ మంత్రి పేర్ని వెంకట రామయ్య, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కే. రోజా, డాక్టర్ మల్లికార్జున- సిఇఒ వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్, బి. రాజశేఖర్ రెడ్డి - అదనపు సిఇఒ వైయస్ఆర్ ఆరోగ్య శ్రీ హెల్త్ ట్రస్ట్ సమక్షంలో అందించి కోవిడ్‌-19కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేసింది.
 
ఈ కంపెనీ తాము కేటాయించుకున్న సీఎస్‌ఆర్‌ బడ్జెట్‌ (కోవిడ్‌-19తో పోరాటం చేసేందుకు)ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఈ దిగువ అవసరాలను తీర్చడానికి వినియోగించింది.
అంబులెన్సులు- రాష్ట్రానికి 10 అంబులెన్సులను విరాళంగా అందించింది.
పీపీఈ (పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌) కిట్స్‌- రాష్ట్రానికి 4వేల కిట్లను విరాళంగా అందించింది.
 
ఈ కార్యక్రమం గురించి శ్రీ పునీత్‌ గోయెంకా, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ, ‘‘మొత్తంమ్మీద ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించి, కోవిడ్-19తో జరుగుతున్న పోరాటంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి బలీయమైన మద్దతునందించడానికి జీ కట్టుబడి ఉంది. ప్రస్తుత మహమ్మారి వేళ రాష్ట్రానికి ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడంలో తామందించే ఆరోగ్యసంరక్షణ అవసరాలు, ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాష్ట్రానికి మరింత దోహదపడతాయని మేము ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
రవాణా, ఐ అండ్ పిఆర్ మంత్రి పేర్ని వెంకట రామయ్య మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌కు అంబులెన్సులు మరియు పిపిఇ కిట్లను అందించిన జీ యాజమాన్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే, కోవిడ్- 19కు వ్యతిరేకంగా వారి పోరాటాన్ని బలోపేతం చేయడంలో వారు భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు సహాయం చేశారని తెలిసింది. ఇలాంటి ఒక అత్యుత్తమ కార్యక్రమం చేపట్టింది జీ నెట్వర్క్ ఎమ్‌డీ పునీత్ గోయెంకా గారు అని తెలిసి చాలా సంతోషిస్తున్నాను” అని అన్నారు.
 
ఏపీఐఐసీ చైర్మన్ ఆర్.కే. రోజా మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 ఉపశమనం కోసం ప్రయతిస్తున్న ఈ సమయంలో మాకు మద్దతు ఇచ్చినందుకు పునిత్ గోయెంకా మరియు జీ ఎంటర్టైన్మెంట్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా వైరస్‌కు  వ్యతిరేకంగా చేస్తున్న ఈ యుద్ధంలో త్వరలోనే మనం అందరం గెలవాలని నేను ఆశిస్తున్నాను” అని అన్నారు.
 
కోవిడ్‌-19కు వ్యతిరేకంగా దేశంలో ఆరోగ్య సంరక్షణ మౌలికవసతులను మెరుగుపరిచేందుకు తమ దేశవ్యాప్త సీఎస్‌ఆర్‌ డ్రైవ్‌లో భాగంగా, 240కు పైగా అంబులెన్సులు, 46వేల పీపీఈ కిట్లు, 90కు పైగా ఆక్సిజన్‌ హ్యుమిడిఫయర్లు, 6 లక్షలకు పైగా రోజువారీ భోజనాలను అందించడానికి జీ కట్టుబడింది. ఈ విరాళాన్ని ఈ జాతీయ స్థాయి సీఎస్‌ఆర్‌ డ్రైవ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించారు.
 
జాతీయ స్థాయిలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా కంపెనీలో పనిచేస్తున్న 5వేల మంది రోజువారీ కూలీలకు కంపెనీ ఆర్థికంగా మద్దతునందించింది. అంతేకాకుండా, 3400 మందికి పైగా ఉద్యోగులు పీఎం కేర్స్‌ ఫండ్‌కు తోడ్పాటునందించారు. ఉద్యోగులు అందించిన మొత్తాలకు సమానమైన మొత్తాన్ని జీ జత చేసి దానిని పీఎం కేర్స్‌ ఫండ్‌కు విరాళంగా అందించింది. బాధ్యతాయుతమైన మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ సంస్థగా, కోవిడ్-19తో పోరాటాన్ని తీవ్రతరం చేయడానికి అవసరమైన బలమైన చర్యలను జీ కొనసాగిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు