కరోనావైరస్: కోవిడ్ రోగి నిర్లక్ష్యం... శిబిరంలో రక్తదానం - ప్రెస్ రివ్యూ

గురువారం, 15 ఏప్రియల్ 2021 (17:15 IST)
తెలంగాణ సంగారెడ్డి జిల్లాలో ఒక కరోనా రోగి రక్తదానం చేశాడని ఈనాడు వార్తా కథనం ప్రచురించింది. కోవిడ్‌ బారినపడిన వ్యక్తి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉండాల్సిందిపోయి జనాల్లోకొచ్చాడు. పైపెచ్చు రక్తదానం చేశాడు. సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘటన అందర్నీ ఆందోళనకు గురిచేసింది. జిల్లాలోని ఇరక్‌పల్లికి చెందిన వ్యక్తి మూడు రోజుల క్రితం మండల కేంద్రం మనూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నాడు.
 
పాజిటివ్‌గా నిర్ధారణవడంతో అక్కడి వైద్యుడు మురళీకృష్ణ మందులు ఇచ్చి, ఇంట్లో క్వారంటెయిన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకుని నాగల్‌గిద్దలో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని వైద్యుడు పర్యవేక్షించారు. ఈ క్రమంలో కొవిడ్‌ రోగి రక్తదానం చేస్తుండగా గుర్తించి అవాక్కయ్యారు. 'ఇంట్లో క్వారంటైన్‌లో ఉండాల్సిన నువ్వు రక్తదానం చేయడమేంటని' నిలదీయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు.
 
దీంతో సేకరించిన 15 యూనిట్ల రక్తాన్ని నిర్వాహకులు బయటపడేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారని ఈనాడు వివరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు