ఈ మహిళలు తుపాకీ రిపేర్ చేస్తే తూటా సూటిగా దూసుకుపోవాల్సిందే...

గురువారం, 18 జులై 2019 (21:21 IST)
యుద్ధరంగంలో తుపాకీ పట్టిన మహిళలను మీరు చూసుండొచ్చు. కానీ, సైనికుల తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలను ఎప్పుడైనా చూశారా? మగవారి పనిగా భావించే ఈ వృత్తిని చేపట్టి ప్రత్యేకంగా నిలిచిన నలుగురు నేపాల్ మహిళల గురించి తెలుసుకుందాం. నేపాల్ సైన్యంలో తుపాకులకు మరమ్మతు చేసేవారిలో మహిళలు నలుగురే నలుగురు. వారు వీరే. వీరి పేర్లు- లీలా కాప్లే, హిమా పోఖ్రాల్, అస్మితా ఆచార్య, కుస్ కుమారి థాపా.
 
"నేపాల్ సైన్యంలో తుపాకులకు మరమ్మతుచేసేవారిలో నేను మొదటి మహిళను అయినందుకు గర్వపడుతున్నా. ఆర్మీలో తప్ప మరెక్కడా నేర్చుకోలేని పని ఇది. ఈ ఉద్యోగంలో నిబద్ధత చాలా అవసరం. ఎందుకంటే తుపాకీతో కాల్చినప్పుడు తూటా కచ్చితంగా గురిపెట్టిన చోటే తగలాలి" అని లీలా కాప్లే చెప్పారు.
 
మగవారు యుద్ధభూమిలో పోరాడుతున్నపుడు మహిళలు తుపాకులను ఎందుకు మరమ్మతు చేయకూడదని అనిపించిందని, తాను కూడా పురుషులతో సమానంగా పనిచేయాలని అనుకోవడం వల్లే ఈ వృత్తిని ఎంచుకొన్నానని కుస్ కుమారి థాపా తెలిపారు. ఈ వృత్తిలోకి మహిళలను తీసుకోవడాన్ని నేపాల్ సైన్యం తొమ్మిదేళ్ల కిందట మొదలుపెట్టింది.
 
సైన్యంలో శిక్షణ ప్రారంభంలో, ఈ తుపాకులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి చాలా ఉండేదని హిమా పోఖ్రాల్ చెప్పారు. తాను పనిచేసేందుకు ఆయుధ నిర్వహణ విభాగాన్ని ఎంచుకున్నానని తెలిపారు.
 
ఈ వృత్తిలో ఉన్న విదేశీ మహిళలను చూసి తాను కూడా గన్‌స్మిత్ కావాలనుకున్నానని అస్మితా ఆచార్య చెప్పారు. "సైన్యంలో పనిచేసే మహిళలు చాలా మందే ఉన్నారు. కానీ తుపాకులకు మరమ్మతులు చేసే మహిళలు నలుగురే ఉన్నారు. వారిలో నేనొకరిని కావడం చాలా సంతోషంగా ఉంది. పురుషుల వృత్తిగా పరిగణించే ఈ పనిని నేను కూడా చేయగలగడం గర్వంగా అనిపిస్తోంది" అని ఆమె సంతోషం వ్యక్తంచేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు