తెలంగాణ: ‘పుచ్చకాయ తిని చనిపోయారు’ - ప్రెస్‌ రివ్యూ

శనివారం, 3 ఏప్రియల్ 2021 (10:45 IST)
నిలువ ఉంచిన పుచ్చకాయ ముక్కలు తిని ఇద్దరు పిల్లలు చనిపోగా.. వారి తల్లిదండ్రులతోపాటు నానమ్మ అస్వస్థతకు గురయ్యారంటూ నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం విస్సంపేటకు చెందిన శ్రీశైలం,గుణవతి దంపతులు, వారి కొడుకులు పన్నెండేళ్ల శివానంద్‌, పదేళ్ల వయసున్న చరణ్‌తోపాటు శ్రీశైలం తల్లి ఒక రోజంతా నిల్వ ఉన్న పుచ్చకాయ ముక్కను తిన్నారు.

 
పుచ్చకాయ ముక్క తిన్న కాసేపటికే వారందరికీ విరోచనాలు మొదలయ్యాయి. అందరూ పెద్దపల్లిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లారు. పిల్లల పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పెద్దలు ముగ్గురు మరో ఆసుపత్రిలో చేరారు.

 
శుక్రవారం తెల్లవారు జామున పరిస్థితి విషమించి చరణ్‌ మృతిచెందగా, తర్వాత కాసేపటికే శివానంద్‌ కూడా ప్రాణాలు కోల్పోయాడు. శ్రీశైలం, గుణవతి, సారమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. కాగా, పుచ్చకాయ విషతుల్యం కావడం వల్లే మృతి చెంది ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నమస్తే తెలంగాణ పత్రిక వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు