ట్రిపుల్ తలాక్: ముస్లిం మహిళలకు ఉపశమనమా, ఉరితాడా?

బుధవారం, 31 జులై 2019 (11:38 IST)
లోక్‌సభ తర్వాత రాజ్యసభలో కూడా ట్రిపుల్ తలాక్ బిల్లు పాసయ్యింది. త్వరలో ఇది చట్టంగా మారబోతోంది. ఇక దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడమే మిగిలింది. ముస్లిం మహిళ (వివాహ హక్కుల సంరక్షణ) బిల్లు 2019 నిబంధనల ప్రకారం ముస్లిం మహిళకు ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం శిక్షార్హమైన నేరం. అలా చెబితే మూడేళ్ల జైలు శిక్ష, దానితోపాటు జరిమానా కూడా ఉండచ్చు.

 
ఈ చట్టంతో ముస్లిం మహిళలకు నిజంగా ఉపశమనం లభిస్తుందా లేక భర్త జైలుకు వెళ్లడం వల్ల వారి జీవితం మరింత కష్టాల్లో పడుతుందా? అది తెలుసుకోడానికే జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు రేఖా శర్మ, సీనియర్ జర్నలిస్ట్ ఫరా నక్వీతో బీబీసీ మాట్లాడింది.
వారేమన్నారో, వారి మాటల్లోనే...

 
విడాకులిచ్చే ముందు పురుషులు ఆలోచిస్తారు - రేఖా శర్మ, జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలు

 
కొత్త ట్రిపుల్ తలాక్ చట్టాన్ని నేను స్వాగతిస్తున్నాను. ముస్లిం మహిళలు చాలా కాలంగా దీని కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం మహిళలు ఎన్నెన్నో భరించాల్సొచ్చింది. నిమిషాల్లోనే ఇంటి నుంచి బయటికి రావాల్సొచ్చింది. ఇది చరిత్రాత్మక అడుగు. ఇది ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటుంది. ఇక ముస్లిం సోదరులు తమ భార్యలకు విడాకులిచ్చే ముందు, అలా చేస్తే తమకు శిక్ష పడుతుందని రెండు-మూడుసార్లు ఆలోచిస్తారు. మహిళా సాధికారత దిశగా కూడా ఇదో పెద్ద అడుగు.

 
సుప్రీంకోర్టు ఒకేసారి ట్రిపుల్ తలాక్ ఇవ్వడాన్ని రాజ్యాంగ విరుద్ధం అని చెప్పినా దానిని పాటించేవారు కాదు. షరియత్‌లో కూడా ట్రిపుల్ తలాక్ ప్రస్తావన లేదు. అయినా ముస్లిం సమాజం దానిని కొనసాగించింది. నిర్దోషులైన భర్తలకు శిక్ష పడేలా చేయడమే ప్రభుత్వ ఉద్దేశం అని నాకు అనిపించడం లేదు. శిక్ష భయంతో ట్రిపుల్ తలాక్ గురించి ఇకపై వారు అసలు ఆలోచించరనే అనుకుంటున్నాను.

 
ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి. మూడు నెలల్లో ఇచ్చే తలాక్‌పై ఎలాంటి నిషేధం లేదు. ఒకేసారి ట్రిపుల్ తలాక్ అనడం చట్టవిరుద్ధం అని మాత్రమే ప్రకటించారు. సుప్రీంకోర్టు సూచనల తర్వాత కూడా ముస్లిం పురుషులు విచక్షణారహితంగా ట్రిపుల్ తలాక్ ఇచ్చేవారు. మా దగ్గర అలాంటి కేసులు చాలా ఉన్నాయి. నెల క్రితమే నా దగ్గరకు ఒక కేస్ వచ్చింది. అంతకు ముందు కూడా ఇలాంటి కేసులు ఎన్నో వచ్చేవి.

 
వాస్తవం ఏంటంటే, ట్రిపుల్ తలాక్‌ అక్రమం అని, దీనిపై చట్టం చేయాలంటూ చాలా మంది ముస్లిం మహిళలు 'సంతకాల ఉద్యమం' కూడా చేశారు. నెల క్రితమే చాలా మంది మహిళలు మాకు దానిపై అర్జీ కూడా ఇచ్చారు. ట్రిపుల్ తలాక్ బిల్లు ప్రత్యేకంగా ఒక మతాన్ని టార్గెట్ చేస్తుందనే వాదనను నేను అసలు అంగీకరించను. ఏ మతానికి, ఏ సమాజానికి చెందినవారైనా చట్టం మహిళలందరికీ సమానంగా ఉండాలనే భావిస్తాను.

 
ఈ కేసుల్లో కోర్టు తీర్పు ఇస్తే బాగుంటుంది. కేసు కోర్టుకు వెళ్లడం వల్ల మహిళలకు కూడా తమ వాదన వినిపించే అవకాశం లభిస్తుంది. మొదట ట్రిపుల్ తలాక్ చెబుతారు, తర్వాత రాత్రికిరాత్రే ఇంటి నుంచి బయటకు గెంటేస్తారు. వారికి ఎలాంటి ఆర్థిక సాయం, చట్టపరమైన సాయం అందేది కాదు అందుకే నాకు ట్రిపుల్ తలాక్ చట్టం మహిళలకు వ్యతిరేకం కాదు, అనుకూలమనే అనిపిస్తోంది.

 
ఇది అర్థం లేని చట్టం- ఫరా నక్వీ, సీనియర్ జర్నలిస్ట్
ఈ చట్టానికి ఏదైనా అర్థం ఉందని నాకు అనిపించడం లేదు. ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు 2017లోనే చెప్పింది. ఇప్పుడు దానినే చట్టం చేయడంలో అర్థం లేదు. దీనిని నేరంగా చేయడంలో కూడా ఉద్దేశమేంటో అర్థం కావడం లేదు. ప్రభుత్వం నేరుగా ముస్లిం పురుషులను టార్గెట్ చేసుకున్నట్లు నాకు అనిపిస్తోంది. ట్రిపుల్ తలాక్ చట్టం వల్ల మహిళలకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పెళ్లి, విడాకులు సివిల్ కేసులు. భారతదేశంలో మొదటిసారి ఈ కేసుల్లో తగిన శిక్ష విధిస్తామని ప్రకటించారు. అలా ఎందుకు?

 
ఇప్పుడు ముస్లిం సమాజం అసలే భయంలో ఉన్నప్పుడు, తమను తాము రెండో తరగతి పౌరులుగా భావిస్తున్నప్పుడు, దేశంలో అప్పుడప్పుడూ మూకదాడుల ఘటనలు జరుగుతున్న సమయంలో.. ప్రభుత్వానికి హఠాత్తుగా ముస్లిం మహిళల గురించి ఇంత బాధ ఎందుకు? ఇది రెండు నాల్కల ధోరణి కాదా? ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నంలో నాకు ఎలాంటి నిజాయతీ కనిపించడం లేదు. భార్యను ఇంటి నుంచి గెంటేసే హక్కు ఏ భర్తకూ లేదు. కానీ అలాంటి సందర్భాల్లో మనకు ఇంతకు ముందే గృహ హింస చట్టం ఉంది. దానిని ఉపయోగించుకోవాలి.

 
ట్రిపుల్ తలాక్ నేరంలో భర్తను జైలుకు పంపిస్తే, భార్య బాగోగులు ఎవరు చూసుకుంటారు? అతడి కుటుంబం, పిల్లలను ఎవరు పట్టించుకుంటారు? ముస్లిం మహిళల అతిపెద్ద సమస్య ట్రిపుల్ తలాక్ మాత్రమే అని ఎలా నిర్ణయిస్తారు? ముస్లిం మహిళలకు వేరే పెద్ద సమస్యలు కూడా ఉన్నాయి. ఈ చట్టంతో వారికి ఉపశమనం లభిస్తుందని నాకనిపించడం లేదు.

 
ఇక విపక్షాల విషయానికి వద్దాం. ట్రిపుల్ తలాక్ బిల్లు పాసవడం విపక్షాల వైఫల్యమే. ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా గళం వినిపించిన నేతలు, తమ పవర్‌ఫుల్ ప్రసంగాలను సిద్ధం చేసుకోడానికి బదులు, విపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చుంటే ఈ ఫలితం బహుశా మరోలా ఉండేది. వాకౌట్ చేసిన విపక్షాలు ఒక సింబాలిక్ వ్యతిరేకతను మాత్రమే చూపించాయి. అది పూర్తిగా ప్రయోజనం లేకుండా పోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు