టాయ్‌లెట్ డస్ట్‌బిన్‌లో కేజీల కొద్దీ బంగారం... ఎక్కడ?

ఆదివారం, 8 జులై 2018 (10:50 IST)
బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ డస్ట్‌బిన్‌లో కేజీల కొద్దీ బంగారం లభించింది. ఈ బంగారాన్ని అజ్ఞాతవ్యక్తి వదిలేసి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈనెల 4వ తేదీన ఎయిర్‌పోర్ట్ టాయిలెట్‌లోని డస్ట్ బిన్‌లో ఓ పాలిథిన్ బ్యాగ్‌ను విమానాశ్రయ హౌస్ కీపింగ్ ఉద్యోగి గుర్తించి, కస్టమ్స్ అధికారులకు తెలిపారు. ఆ వెంటనే అక్కడకు చేరుకున్న అధికారులు.. ఆ బ్యాగ్‌ను తెరిచి చూడగా, అందులో బంగారపు బిస్కెట్లు ఉన్నాయి. తొలుత బ్యాగులో ఏమైనా పేలుడు పదార్ధాలు ఉంటాయేమోనని భావించిన అధికారులు అందులో 2.8 కేజీల బంగారాన్ని చూసి అవాక్కయ్యారు.
 
ఈ బంగారం విలువ రూ.85 లక్షలు ఉంటుందని అధికారులు వెల్లడించారు. బంగారాన్ని అక్రమంగా తరలించే క్రమంలో ఎయిర్ పోర్ట్‌లో చెకింగ్స్ ఎక్కువగా ఉండటంతో బయటకు తీసుకెళ్లలేక బంగారాన్ని టాయిలెట్‌లోని డస్ట్‌బిన్‌లో పడేసి వెళ్లి ఉండవచ్చని, ఉదయాన్నే వచ్చిన ఇండిగో విమానం నుంచి దిగిన వ్యక్తే ఈ పని చేసినట్లు కస్టమ్స్ అధికారులు అనుమానిస్తున్నారు. బంగారాన్ని డస్ట్ బిన్‌లో వదిలివెళ్లిన నిందితుడి కోసం సీసీఫుటేజీని పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు