మధ్యంతర బడ్జెట్ 2024 : 57 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించిన విత్తమంత్రి నిర్మలమ్మ

ఠాగూర్

గురువారం, 1 ఫిబ్రవరి 2024 (13:43 IST)
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో గురువారం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారమన్ ఉదయం 11 గంటలకు తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించి, కేవలం 57 నిమిషాల్లో తన ప్రసంగ పాఠాన్ని పూర్తి చేశఆరు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రజల ముందు ఉంచారు. కేంద్ర పద్దును నిర్మలమ్మ ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఆరోసారి. అయితే, గతంతో పోలిస్తే ఈసారి ఆమె తన ప్రసంగాన్ని గంటలోపే ముగించారు.
 
నిర్మలా సీతారామన్‌ ఇప్పటివరకు చేసిన బడ్జెట్‌ ప్రసంగాల్లో ఈసారే అతి తక్కువ సమయం మాట్లాడారు. ఈసారి ఆమె దేశ పద్దును 57 నిమిషాల్లో లోక్‌సభ వేదికగా దేశ ప్రజలకు వినిపించారు. గతంలో 2 గంటల పైనే బడ్జెట్ ప్రసంగం చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా, ఎక్కువసార్లు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా.. అత్యధిక సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 
 
2020-21 బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 162 నిమిషాల (2 గంటల 42 నిమిషాలు) పాటు ప్రసంగించారామె. అప్పుడు ఒంట్లో నలతగా ఉండడంతో మరో రెండు పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. బడ్జెట్‌ చరిత్రలో ఇదే ఇప్పటివరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఇక, 2019-20 బడ్జెట్‌లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివిపరంగా రెండో అతి పెద్దది. అంతకుముందు 2003-04 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన జశ్వంత్‌సింగ్‌ 135 నిమిషాల పాటు మాట్లాడారు. గతేడాది నిర్మలమ్మ 86 నిమిషాల పాటు బడ్జెట్‌ ప్రసంగం వినిపించారు.
 
2019లో ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. పూర్తిస్థాయి ఆర్థికశాఖ మంత్రిగా పనిచేసిన తొలి మహిళగా చరిత్రకెక్కారు. ఇక అదే ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆమె.. ఈ ఘనత సాధించిన రెండో మహిళగా నిలిచారు. 1970-71లో ఇందిరాగాంధీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి మహిళగా కీర్తి గడించారు. ఆ సమయంలో ఆమె తాత్కాలిక ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఇక, మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా నిర్మలమ్మ మరో రికార్డు నెలకొల్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు