సాధారణ రైళ్ల కోసం వందే భారత్ తరహాలో 40 వేల రైలు బోగీలు

ఠాగూర్

గురువారం, 1 ఫిబ్రవరి 2024 (16:15 IST)
దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్న సాధారణ రైళ్ళలో ప్రయాణికుల భద్రత, ప్రయాణ సౌకర్యం కోసం అధునాత సౌకర్యాలతో వందే భారత్ తరహాలో 40 వేల రైలు బోగీలను తయారు చేసేలా చర్యలు తీసుకుంటామని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె గురువారం లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తన బడ్జెట్ ప్రసంగంలో రైళ్లు, విమానయాన రంగానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. 
 
దేశంలో రైల్వేల బలోపేతానికి ప్రభుత్వం అనేక కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం కింద మూడు కారిడార్లను నిర్మిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కోసం మూడు రైల్వే కారిడార్లను నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. వందే భారత్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం దేశంలోని ఇతర నగరాలతో మెట్రో రైలు నమో భారత్‌ అనుసంధానిస్తుందన్నారు.
 
అలాగే, దేశంలో మూడు ఆర్థిక కారిడార్ల‌ను రూపొందిస్తామని తెలిపారు. ఇంధ‌న‌, ఖ‌నిజ‌, సిమెంట్ రంగాల‌కు చెందిన ఓ కారిడార్‌ను రూపొందించ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్‌ను కూడా డెవ‌ల‌ప్ చేయ‌నున్న‌ట్లు ఆమె వెల్ల‌డించారు. మ‌ల్టీ మోడ‌ల్ క‌నెక్టివిటీ కోసం పీఎం గ‌తి శ‌క్తి స్కీమ్‌ను బ‌లోపేతం చేస్తున్న‌ట్లు ఆమె చెప్పారు. 
 
ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌ను మ‌రింత బలోపేతం చేసేందుకు కొత్త స్కీమ్‌ను ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు మంత్రి సీతారామ‌న్ తెలిపారు. కొత్త‌గా మూడు కోట్ల‌ మంది మ‌హిళ‌ల్ని ల‌క్షాధికారుల్ని చేయ‌డ‌మే త‌మ ప్ర‌భుత్వ టార్గెట్ అని ఆర్ధిక మంత్రి వెల్ల‌డించారు. దేశ‌వ్యాప్తంగా అయిదు స‌మీకృత ఆక్వా పార్క్‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. ప్ర‌పంచంలోనే పాల ఉత్ప‌త్తిలో ఇండియా టాప్ ప్లేస్‌లో నిలిచింద‌న్నారు.
 
అలాగే, ఈ పదేళ్ల కాలంలో ప్రజల వాస్తవిక ఆదాయం 50 శాతం మేరకు పెరిగిందన్నారు. వాస్తవ ఆదాయం పెరుగుదల కారణంగా ప్రజల జీవన ప్రమాణాలు కూడా పెరిగాయన్నారు. స్టార్టర్‌ ఇండియా ద్వారా యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తున్నట్టు చెప్రారు. గ్రామీణ ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజన ఇళ్లలో 70 శాతం మహిళల పేరుపైనే ఇచ్చామని వెల్లడించారు. జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, ఫెర్ఫార్మెన్స్ అని కొత్త అర్థం చెప్పారు. ఈ పదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని సమతుల్యంగా ఉంచినట్టు విత్తమంత్రి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు