వృద్ధిరేటులో పాకిస్థాన్ కంటే వెనుకబడిన భారత్?

బుధవారం, 4 సెప్టెంబరు 2019 (12:01 IST)
ప్రపంచంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నది ప్రతి ఒక్కరి భావన. కానీ, ఇటీవల కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన జీడీపీ వృద్ధిరేటులో భారత్ ఆరేళ్ళ కనిష్టానికి పడిపోయింది. పైగా, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్ వంటి దేశాల వృద్ధిరేటు కంటే తక్కువగా నమోదైంది. ప్రస్తుతం భారత్ వృద్ధిరేటు 5 శాతంగా ఉంటే, పాకిస్థాన్ వృద్ధిరేటు 5.4 శాతం, భూటన్ వృద్ధిరేటు 7.4 శాతం, నేపాల్ వృద్ధిరేటు 7.9 శాతం, బంగ్లాదేశ్ 8.31 శాతంగా ఉన్నట్టు ఎకనామిక్ టైమ్స్ పత్రిక గత నెల 30వ తేదీన వెల్లడించింది.
 
మరోవైపు ఐఎన్‌ఎక్స్‌ మీడియా స్కామ్‌లో అరెస్టు అయిన కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం కూడా ఈ వృద్ధిరేటుపై వెటకారంగా మాట్లాడారు. ఆయన కోర్టు నుంచి బయటకు వస్తుండగా ఒక విలేకరి తన కస్టడీ గురించి చెప్పాలని కోరగా 'రాజకీయ నాయకులు చెప్పాలి.. ఐదు శాతం. 5 శాతం అంటే ఏమిటో మీకు తెలుసా?' అని ఎగతాళిగా మాట్లాడుతూ.. తన ఐదు వేళ్లను మీడియాకేసి చూపారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థ ఐదు శాతం క్షీణించింది అనడానికి ఉదాహారణగా చిదంబరం ఐదు వేళ్లను చూపించారని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి మందగించి, ఆరు సంవత్సరాల కనిష్టానికి చేరిన నేపథ్యంలో చిదంబరం ఇలా తన చేతి వేళ్లతో బీజేపీ ప్రభుత్వ పని తీరును ఎద్దేవా చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు