విధులకు సిద్ధంగా ఉండాలి... 17 జోన్లకు రైల్వే శాఖ ఆదేశాలు

ఆదివారం, 5 ఏప్రియల్ 2020 (11:28 IST)
కరోనా వైరస్ కారణంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ కొనసాగుతోంది. దీంతో నిత్యావసర సేవలు, రాకపోకలు మినహా అన్ని సేవలు బంద్ అయ్యాయి. దేశ విదేశీ విమాన సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, దేశ వ్యాప్తంగా రైళ్ళ రాకపోకలు కూడా నిలిచిపోయాయి. అయితే, ఈ లాక్‍‌డౌన్ కాలపరిమితి ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. దీంతో 15వ తేదీ నుంచి కొన్ని ప్రైవేట్ విమానయాన సంస్థలు దేశీయంగా విమాన సర్వీసులను నడిపేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మాత్రం ఏప్రిల్ 30వ తేదీ వరకు ఎలాంటి సర్వీసులు నడుపబోమని తేల్చిచెప్పింది. 
 
మరోవైపు, రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15వ తేదీ నుంచి రైళ్ళ రాకపోకలను ప్రారంభించాలని భావిస్తోంది. ఇందుకోసం దేశంలోని 17 జోనల్ కార్యాలయాలకు ఓ మెమో పంపింది. ఈ నెల 15వ తేదీన ఉద్యోగులంతా తమతమ విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలని అందులో కోరింది. ముఖ్యంగా, రైల్వే సేఫ్టీ సిబ్బంది, రన్నింగ్ స్టాఫ్, గార్డులు, టీటీఈ, ఇతర అధికారులంతా విధుల్లో చేరేందుకు సిద్ధంగా ఉండాలని సూచన చేసింది. 
 
అయితే, రైళ్ళ రాకపోకలను పునరుద్ధరించే అంశంపై మంత్రుల ఉప సంఘం (జీవోఎం) పచ్చజెండా ఊపాల్సివుంది. అయినప్పటికీ, రైల్వే శాఖ మాత్రం రైలు సర్వీసులు పునరుద్ధరించేందుకు వీలుగా సిబ్బంది అంతా సిద్ధంగా ఉండాలని కోరింది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే రాజధాని, శతాబ్ధి, దురంతో రైళ్ళతో పాటు.. 80 శాతం మేరకు ప్యాసింజర్ రైళ్ళను ఈ నెల 15వ తేదీ నుంచి నడపాలని భావిస్తోంది. 
 
కాగా, గత మార్చి నెల 24వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేశారు. ఆ రోజు నుంచి దేశ వ్యాప్తంగా 13523 రైళ్ళ రాకపోకలను 21 రోజుల పాటు నిలిపివేయాలని రైల్వే శాఖ నిర్ణయించి, దాన్ని అమలు చేస్తున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు