త్వరలోనే కౌంటర్లలో రైల్వే టిక్కెట్ల విక్రయం : పియూష్ గోయల్

గురువారం, 21 మే 2020 (15:27 IST)
కరోనా సంక్షోభం కారణంగా దేశ వ్యాప్తంగా రైలు సర్వీసులను నిలిపివేశారు. ఆ తర్వాత దశల వారీగా వీటిని నడిపేందుకు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా తొలుత శ్రామిక్ రేళ్లను రైల్వే శాఖ నడిపింది. ఆ తర్వాత దేశంలోని 15 ముఖ్య నగరాలకు స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది. అయితే, జూన్ ఒకటో తేదీ నుంచి మరో 200 రైళ్లను నడుపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. ఈ రైళ్లు నడిచే మార్గాలను కూడా ప్రకటించింది. అయితే, ఈ రైళ్ళలో ప్రయాణం చేయాలంటే కేవలం ఆన్‌లైన్‌లోనే రిజర్వేషన్ చేసుకోవాల్సివుంటుంది.
 
ఈ నేపథ్యంలో త్వరలోనే రైల్వే కౌంటర్లు తెరుస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. టికెట్ల విక్రయాలు ఇకపై రైల్వే కౌంటర్ల ద్వారా కూడా జరపబోతున్నామన్నారు. 
 
దేశవ్యాప్తంగా జూన్ ఒకటి నుంచి తిరిగి ప్రారంభమయ్యే రైలు సర్వీసులకు ఆన్‌లైన్‌బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయన్నారు. ప్రతిరోజూ వివిధ మార్గాల్లో నడిచే 200 రైలు సర్వీసులకు ప్రస్తుతం రిజర్వేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. 


తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైళ్లు.. వాటి వివరాలు...  
వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దేశ వ్యాప్తంగా 200 రైళ్లను నడిపేందుకు కేంద్ర రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. దీనికి కారణం.. లాక్డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలించడమే. ఫలితంగా ప్రస్తుతం నడుస్తున్న శ్రామిక్ రైళ్ళతో సంబంధం లేకుండా కొత్తగా మరో 200 రైళ్లను నడుపనున్నారు. 
 
అయితే, తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే రైళ్ళు ఏవి.? ఏయే రూట్లలో నడుస్తాయి? ప్రయాణ వేళలు ఏమిటి? తదితర వివరాలను బుధవారం రాత్రి రైల్వే బోర్డు ఖరారు చేసి విడుదల చేసింది. ఈ వివరాలను అన్ని జోన్ల జీఎంలకు పంపింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రూట్లను ఎంపిక చేశారు.
 
ఈ రైళ్లలో ప్రయాణం చేయదలసిన వారు గురువారం నుంచి అంటే మే 21వ తేదీ నుంచి రిజర్వేషన్ చేసుకోవచ్చు. స్లీపర్ బోగీల్లో రిజర్వేషన్లు పూర్తయిన తర్వాత 200 టికెట్లను వెయిటింగ్ లిస్టులో జారీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటివరకు నడిపిన ప్రత్యేక రైళ్లలో జనరల్ బోగీలు లేకపోగా, జూన్ 1 నుంచి నడపనున్న రైళ్లు సాధారణ రైళ్లలాగా, ఏసీ, స్లీపర్, జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు. అలాగే, స్టాపులు కూడా గతంలో మాదిరిగానే ఉంటాయి.
 
ఇక, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ రైళ్లలో సాధారణ బోగీలు ఉన్నప్పటికీ వాటికీ రిజర్వేషన్ ఉంటుంది. అంటే రైలులోని అన్ని బోగీలు రిజర్వేషనే అన్నమాట. జనరల్ కోచ్‌లో ప్రయాణించే వారి నుంచి ద్వితీయ శ్రేణి సీటింగ్ రుసుమును వసూలు చేస్తారు. టికెట్లు అన్నింటినీ ఆన్‌లైన్‌లోనే తీసుకోవాలి. రైల్వే స్టేషన్‌లో టికెట్లు విక్రయించరు. నెల రోజుల ముందుగా కూడా టికెట్లను రిజర్వు చేసుకునే వీలుంది.
 
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించనున్న రైళ్ళ వివరాలు... 
* ముంబై - హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎక్స్‌ప్రెస్ (02701/02)
* హౌరా - సికింద్రాబాద్ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ (02703/04)
* హైదరాబాద్ - న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (02723/24)
* దానాపూర్ - సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (02791/92)
* విశాఖపట్టణం - ఢిల్లీ ఏపీ ఎక్స్‌ప్రెస్ (02805/06)
* గుంటూరు - సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్ (07201/02)
* తిరుపతి - నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02793/94) 
* హైదరాబాద్ - విశాఖపట్టణం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727/28)
* వీటితోపాటు సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ (02285/86) రైలును వారానికి రెండుసార్లు నడపనున్నారు.
* హౌరా - యశ్వంత్‌పూర్ దురంతో ఎక్స్‌ప్రెస్ (02245/46) ఇది వారానికి ఐదు రోజులు నడుస్తుంది. 
* ముంబై సీఎస్‌టీ - భువనేశ్వర్ కోణార్క్ ఎక్స్‌ప్రెస్ (01019/20) రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ మీదుగా డైలీ నడుస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు