పంచ సూత్రాలతో ఆర్థిక ప్యాకేజీ రూపకల్పన : విత్తమంత్రి నిర్మలమ్మ

బుధవారం, 13 మే 2020 (16:46 IST)
కరోనా వైరస్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. అనేక రాష్ట్రాలు తీవ్ర ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా, పేదలు, దినకూలీలు, వలస కార్మికులు, రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చెందిన వారు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. గత 50  రోజులకు పైగా సాగుతున్న లాక్డౌన్ కారణంగా ఖజానా ఖాళీ అయిపోయింది. పైగా, ఆయా రాష్ట్రాలకు రావాల్సిన పన్నులన్నీ ఆగిపోయాయి. దీంతో రాష్ట్రాల నుంచి కేంద్రం వరకు ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చేందుకు, వెన్నుదన్నుగా నిలిచేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ "ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్" పేరుతో రూ.20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు.
 
ఈ ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం మీడియా ద్వారా దేశ ప్రజలకు వివరించారు. వివిధ మంత్రిత్వ శాఖలతో చర్చించిన అనంతరం ప్యాకేజీకి రూపకల్పన చేశామన్నారు. ఈ ప్యాకేజీ దేశ అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పారు. 'స్వీయ ఆధారిత భారతం' పేరుతో ప్యాకేజీకి రూపకల్పన చేసినట్లు తెలిపారు. 
 
అంతర్జాతీయ స్థాయిలో భారత ఉత్పత్తులకు పేరు తీసుకురావడమే లక్ష్యమని తెలిపారు. దేశాన్ని అన్ని రకాలుగా పునరుత్తేజం చేసేందుకే రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని రూపొందించినట్లు చెప్పారు. అందుకోసమే దీనికి ‘ఆత్మ నిర్భర్ భారత్’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఐదు సూత్రాలతో ఈ ప్యాకేజీని రూపొందించామని.. ఆర్థిక, మౌలిక, సాంకేతిక, దేశ జనాభా, డిమాండ్ ప్రధాన సూత్రాలని నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు