ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో రూ.5.27 కోట్ల నగదు స్వాధీనం

గురువారం, 16 జులై 2020 (09:20 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఏకంగా 5.27 కోట్ల రూపాయల నగదును తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు.. బంగారాన్ని కూడా వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. 
 
గురువారం వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చెన్నైకి గంజాయి తరలిస్తున్నట్టు తమిళనాడు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎళావూరు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. 
 
ఆ సమయంలో ఏపీ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు ఒకటి వచ్చింది. ఆ కారును అనుమానించిన పోలీసులు... ఆపి తనిఖీ చేశారు. అపుడు కారు వెనుక సీటులో ఉన్న నాలుగు సంచులను గుర్తించి బయటకు తీశారు. వాటిని తెరిచి చూడగా పెద్ద మొత్తంలో డబ్బు కనిపించింది.
 
మొత్తం 5.27 కోట్లు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు దానికి సంబంధించి ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని ఆదాయ పన్ను శాఖకు అప్పగించారు. అలాగే, కారులో ఉన్న ఒంగోలుకు చెందిన నాగరాజ్, వసంత్, కారు డ్రైవర్ సత్యనారాయణను అరెస్ట్ చేశారు. 
 
కారుపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. కోయంబత్తూరు సెంట్రల్ ఆర్టీవీ పరిధిలోని వి.రామచంద్రన్ అనే వ్యక్తి పేరిట కారు రిజిస్టర్ అయినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు