కరోనావైరస్, తమిళనాడు పోలీసులకు చుక్కలు చూపిస్తున్న జనం, రంగంలోకి డ్రోన్‌లు

బుధవారం, 15 జులై 2020 (20:04 IST)
తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనావైరస్ తీవ్రంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. దీనికితోడు కొన్నిచోట్ల మాస్కులు ధరించలేదని కేసులు నమోదు చేస్తున్నారు. మరికొన్నిచోట్ల బయట తిరుగుతున్నారని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. ఇన్ని చేసినా తమిళనాడు జనం మాత్రం కరోనావైరస్‌ను సీరియస్‌గా తీసుకోవడంలేదు. పోలీసులు మొత్తుకుని చెపుతున్నప్పటికీ మాస్కులు లేకుండా ఇష్టం వచ్చినట్లు రోడ్లపైకి వచ్చేస్తున్నారు.
 
చాలామంది మాస్కులను గడ్డాలకు తగిలించుకుని వెళుతున్నారు. ఇక లాభం లేదని తమిళనాడు పోలీసులు డ్రోన్‌తో కరోనా ప్రచారం మొదలుపెట్టారు. వీధిలో ఈ డ్రోన్లు వెళుతుంటే వీటిని చూసేందుకు అందరూ ఎగబడతారని భావించి దానికి మైక్ ఏర్పాటు చేసి బయటకు రావద్దనీ, చెప్పేది వినండంటూ ప్రచారాలు చేస్తున్నారు.
 
కరోనా దేశంలో విజృంభణ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు, మహారాష్ట్రలో దీని తీవ్రత పెరిగింది. తమిళనాడులో ఇప్పటికే లక్షన్నర చేరువగా కరోనా పాజిటివ్ కేసులు దూసుకెళ్తున్నాయి. ఈ నేపధ్యంలో డ్రోన్ల సహాయంతో ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తున్నారు తమిళనాడు పోలీసులు. మరి వారి ప్రయోగం ఎంతమేరకు ఫలితం ఇస్తుందో చూడాలి.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు