రెండు ఎలుకల మధ్య తగవును పిల్లి తనకు అనుకూలంగా తీర్చినట్లు తమిళనాడు రాజకీయ సంక్షోభానికి అదిరిపోయే ట్విస్ట్ తోడయింది. తదుపరి ముఖ్యమంత్రి శశికళనా... పన్నీర్ సెల్వమా అని అందరూ బుర్రబద్దలు కొట్టుకుంటున్న తరుణంలో వీరిద్దరూ కాదు తామని డీఎంకే తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం వికసిస్తుందని పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా శనివారం కొత్త చర్చకు తెరదీశారు.
శశికళ, పన్నీర్సెల్వం మధ్య బలపరీక్ష అనివార్యమైన పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా తమ ఎమ్మెల్యేల మద్దతు సెల్వంకి ఉంటుందని స్టాలిన్ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఒక్క రోజులోపే మాట మార్చిన స్టాలిన్ సుపరిపాలనతో ప్రజలను తమవైపు తిప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాశ్రేయస్సును కోరుకోవడం తమ పార్టీ కర్తవ్యంగా భావిస్తామని చెప్పారు.
గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 136 స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకుంది. జయలలిత మరణంతో ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 89 స్థానాలతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్కు 8, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు.
అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 117 కాగా మిత్రపక్షాలను కలుపుకుని అసెంబ్లీలో డీఎంకే బలం 98. ఈ నేపథ్యంలో బలపరీక్షలో నెగ్గి పన్నీర్సెల్వం సీఎం కాలేరని భావించే, శశికళ వద్ద ఇమడలేని 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేరదీసి డీఎంకే అధికారంలోకి రావచ్చు. ఈ ఆలోచనతోనే స్టాలిన్ వ్యాఖ్యానించారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి.