వలస కార్మికులతో పెరుగుతున్న కరోనా కేసులు.. మహిళకు కోవిడ్

మంగళవారం, 12 మే 2020 (15:04 IST)
వలస కార్మికులతో కరోనా కేసులు కూడా పెరుగుతున్నాయి. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వస్తున్న కార్మికుల్లో కరోనా లక్షణాలు బయటపడుతున్నాయి. తాజాగా భద్రాచలం జిల్లాలోని మోటకొండూరు మండలం కేంద్రానికి ముంబై నుంచి వచ్చిన ఏడుగురు వలస కార్మికుల్లో ఒక మహిళకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కాగా వీరిని ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఫీవర్ హాస్పిటల్‌కు క్వారెంటైన్‌ కోసం పంపించారు. వారికి అక్కడ కరోనా టెస్ట్‌ చేయగా మహిళకు పాజిటివ్ అని తేలిందని మండల వైద్యాధికారి రాజేందర్ నాయక్ తెలిపారు. 
 
ఇదిలా ఉంటే.. చెన్నై నుంచి బయలుదేరిన వలస కార్మికుల శ్రామిక్‌ రైలు శ్రీకాకుళం చేరుకుంది. కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో చెన్నైలో చిక్కుకుపోయిన 889 మంది జిల్లా వాసులు ఈ రైలు ద్వారా శ్రీకాకుళానికి చేరుకున్నారు. వీరిలో 685 మంది మత్స్యకారులు ఉండగా 204 మంది వలస కూలీలు ఉన్నారు. వలస కూలీలందరిని అధికారులు క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించనున్నారు. చెన్నై నుంచి వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా 30 బస్సులను ఏర్పాటు చేశారు.
 
మరోవైపు విజయవాడ నగరంలో ఎక్కడా కూడా దుకాణాలు తెరుచుకోలేదు. విజయవాడ నగరం పూర్తిగా రెడ్ జోన్, బఫర్ జోన్స్ ఉన్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దుకాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాలలో కూడా పాజిటివ్ కేసులు రావడంతో అక్కడ కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కేవలం ఉదయం 6నుంచి 9గంటల వరకు మాత్రమే అధికారులు సడలింపులిచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు