Corona: 4 లక్షలు దాటిన మరణాలు; కొత్తగా 46వేల కేసులు.. 59వేల రికవరీలు

శుక్రవారం, 2 జులై 2021 (10:28 IST)
దిల్లీ: ఏడాదిన్నరకు పైగా గడగడలాడిస్తోన్న మయాదారి కరోనా.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని పొట్టనబెట్టుకుంటోంది. భారత్‌లో ఇప్పటివరకు ఈ మహమ్మారి 4లక్షల మందిని బలితీసుకుంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,00312కు చేరింది. ఇక దేశంలో కొత్తగా మరో 46వేల మందికి కరోనా సోకగా.. 59వేల మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు.
 
యాక్టివ్‌ కేసులు.. 5లక్షలు
గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 18.80 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 46,617 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 25 రోజులుగా పాజిటివిటీ రేటు 5శాతానికి దిగువనే ఉండటం ఊరట కలిగిస్తోంది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3.04కోట్లకు చేరింది. ఇక ఇదే సమయంలో 59,384 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 2.95కోట్ల మంది కరోనాను జయించారు. రికవరీ రేటు 97.01శాతాని పెరిగింది. కొత్త కేసులు తగ్గుముఖం పట్టడంతో యాక్టివ్‌ కేసుల కొండ భారీగా కరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,09,637 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.67శాతానికి దిగొచ్చింది.
 
34 కోట్లు దాటిన వ్యాక్సినేషన్‌
దేశంలో టీకా పంపిణీ ప్రక్రియ కూడా ఊపందుకుంది. టీకాల లభ్యత, కొత్త టీకాల రాకతో వ్యాక్సినేషన్‌ విస్తరిస్తోంది. గురువారం మరో 42.6లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయగా.. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 34 కోట్ల మంది టీకాలు తీసుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
మూడో దేశం.. భారత్‌
అమెరికా, బ్రెజిల్‌ తర్వాత 4లక్షలకు పైగా కరోనా మరణాలు నమోదైన మూడో దేశం భారతే. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధికంగా 6లక్షల మందికి పైనే వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో 5.2 లక్షల మందిని కరోనా బలితీసుకుంది. ఈ మూడు దేశాలు కాకుండా మెక్సికోలో 2లక్షలకు పైగా మంది కరోనాతో మరణించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా 10 దేశాల్లో మరణాల సంఖ్య లక్ష దాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు