దేశంలో కరోనా దూకుడు : 4 లక్షలు దాటిన పాజిటివ్ కేసులు

ఆదివారం, 21 జూన్ 2020 (10:27 IST)
దేశంలో కరోనా వైరస్ దూకుడుకు అడ్డుకట్టపడటం లేదు. ఫలితంగా రోజు రోజుకూ వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15413 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,10,461కి చేరింది. 
 
ఈ వైరస్‌ బారినపడినవారిలో ఒక్క రోజులోనే 306 మంది మరణించడం ఇపుడు ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 13,254కి పెరిగింది. మొత్తం నమోదైన కేసుల్లో 1,69,451 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,27,756 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 
 
కరోనా వైరస్‌ తీవ్రరూపం దాల్చడంతో దేశంలో ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,28,205 పాజిటివ్‌ కేసులు ఉండగా, 5,984 మంది బాధితులు మరణించారు. 
 
ఆ తర్వాత రెండో స్థానంలో తమిళనాడు ఉంది. ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 56,845కి చేరింది. రాష్ట్రంలో 704 మంది ఈ వైరస్‌ వల్ల మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో 56,746 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 2,112 మంది మృతిచెందారు. గుజరాత్‌లో 26,680 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 1638 మంది మరణించారు. అత్యధిక కేసుల జాబితాలో ఐదోస్థానంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 16594 కేసులు నమోదవగా, 507 మంది మరణించారు. 
 
వణికిపోతున్న బ్రెజిల్ 
మరోవైపు, బ్రెజిల్ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతోంది. ఈ దేశంలో ఈ వైరస్ విలయతాండవం చేస్తోంది. ఫలితంగా ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 50 వేలు దాటింది. అలాగే, అత్యధిక కరోనా కేసుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో ఇప్పటివరకు 10,70,139 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ బారినపడినవారిలో 50,058 మంది మరణించగా, 5,43,18 మంది కోలుకున్నారు. మరో 4,76,895 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 
 
దేశంలో మొదటి కరోనా వైరస్‌ కేసు ఫిబ్రవరి 26న నమోదవగా, జూన్‌ 19న పది లక్షల మార్కును దాటాయి. కేవలం బ్రెజిల్‌లోనే కాకుండా లాటిన్‌ అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఈ మహమ్మారి తన ప్రతాపం చూపిస్తున్నది. లాటిన్‌ అమెరికాలో ఇప్పటివరకు 20,04,019 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు