దేశంలో పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. రాష్ట్రాలకు కేంద్ర బృందాలు

గురువారం, 25 ఫిబ్రవరి 2021 (10:47 IST)
దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మ‌ళ్లీ పెరుగుతోంది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 16,738 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదేస‌మ‌యంలో 11,799 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,46,914కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 138 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,705 కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,38,501 మంది కోలుకున్నారు. 1,51,708  మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,26,71,163మందికి వ్యాక్సిన్ వేశారు.
    
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,38,29,658 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,93,383 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది
 
మరోవైపు, పలు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న తీరును పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకునే దిశగా సిఫార్సులు చేసేందుకు 10 రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపనుంది. 
 
ఈ బృందాలు మహారాష్ట్ర, కేరళ, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, జమ్ము కాశ్మీర్ లో పర్యటించనున్నాయి. ఈ రాష్ట్రాల్లోనే కేసులు ఎందుకు ఒక్కసారిగా పెరుగుతున్నాయన్న విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడమే లక్ష్యంగా టీమ్ లను ఏర్పాటు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
 
ఆయా రాష్ట్రాల్లోని ప్రజారోగ్య శాఖ, జిల్లా, మండల స్థాయి అధికారుల సహకారంతో పాటు కొవిడ్ రెస్పాన్స్, మేనేజ్ మెంట్ టీమ్ లతో చర్చించి ఈ టీమ్‌లు తమ నివేదికను సమర్పిస్తాయని, దాని ఆధారంగా తదుపరి నిర్ణయాలు ఉంటాయని కేంద్ర ఉన్నతాధికారులు వెల్లడించారు. 
 
కరోనా మహమ్మారిపై ఇప్పటివరకూ జరిపిన పోరాటం వృథా కాకుండా చూడటమే ఈ బృందాల విధని తెలిపారు. ఈ మేరకు కేంద్రం నుంచి వచ్చే అధికారులకు సహకరించాలని పది రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాశామని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు.
 
ఈ రాష్ట్రాల్లో జరుగుతున్న ఆర్టీ-పీసీఆర్ పరీక్షల వివరాల నుంచి ఎన్ని పరీక్షలు చేస్తే, ఎన్ని పాజిటివ్ లు వస్తున్నాయి? పాజిటివ్ రేషియో, కేసులు ఎక్కువగా వస్తున్న ప్రాంతాల వివరాలు, అక్కడి కంటెయిన్ మెంట్ జోన్లు, తీసుకుంటున్న నియంత్రణా చర్యలన్నింటినీ అధికారులు సమీక్షిస్తారని తెలిపారు. 
 
కరోనా లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ యాంటీజెన్ పరీక్షలు తప్పనిసరని, ఈ పరీక్షల్లో నెగటివ్ వచ్చినా, జలుబు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి ఆర్టీ-పీసీఆర్ పరీక్ష తప్పనిసరని ఆయన అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు