భారత్‌లో శరవేగంగా కోవ్యాగ్జిన్ - అతి త్వరలో మూడో దశ ప్రయోగాలు...

ఆదివారం, 11 అక్టోబరు 2020 (11:41 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు విరుగుకనిపెట్టే పనిలో శాస్త్రవేత్తలతో పాటు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు నిమగ్నమైవున్నాయి. ఇందులోభాగంగా, మన దేశానికి చెందిన భారత్ బయోటెక్, ఐసీఎంఆర్, పుణె వైరాలజీ‌ ల్యాబ్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న కోవాగ్జిన్, మూడో దశ ట్రయల్స్‌ను భారీ ఎత్తున చేపట్టేందుకు డ్రగ్ నియంత్రణా సంస్థ అనుమతులను మంజూరు చేసింది. 
 
రెండో దశ ట్రయల్స్‌లో భాగంగా చేసిన పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని భారత్ బయోటెక్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదేశించింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి భద్రత, వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగిన విధానంపై పూర్తి సమాచారాన్ని కోరింది.
 
ప్రస్తుతం కోవాగ్జిన్ రెండో దశ ట్రయల్స్ ముగించుకుని, మూడో దశలోకి ప్రవేశిస్తోంది. తమ వ్యాక్సిన్ అన్ని రకాల జంతువులపైనా సమర్థవంతంగా పనిచేసిందని, వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత వైరస్‌ను ఇవి ఎదుర్కొన్నాయని పేర్కొంది. 
 
ఆపై దేశవ్యాప్తంగా 12 ఆసుపత్రుల్లో కోవాగ్జిన్‌ను మానవులపై పరీక్షించిన సంగతి తెలిసిందే. ఇందులోభాగంగా 18 నుంచి 55 ఏళ్ల వయసున్న వాలంటీర్లపై వ్యాక్సిన్‌ను ప్రయోగించారు. హైదరాబాద్ సహా, రోహ్‌తక్, పాట్నా, కాంచీపురం, ఢిల్లీ, గోవా, భువనేశ్వర్, లక్నో తదితర ప్రాంతాల్లో ట్రయల్స్ జరిగాయన్నారు. 
 
గతవారంలో ట్రయల్స్ వివరాలతో భారత్ బయోటెక్ నివేదిక రూపొందించింది. వ్యాక్సిన్ తయారీకి అవసరమైన సాంకేతికత కోసం కాన్సాస్ కేంద్రంగా నడుస్తున్న విరోవ్యాక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపింది. కరోనా పాథోజన్‌లతో ఈ వ్యాక్సిన్ దీర్ఘకాలం పాటు పోరాడుతుందని భావిస్తున్నట్టు సంస్థ ఎండీ ఎల్లా కృష్ణ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు