ముంబైలో ఫలిస్తున్న లాక్డౌన్ : 3 వారాల కనిష్టానికి కొత్త కేసులు

ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (08:41 IST)
మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో కరోనా వైరస్ కాస్త శాంతంచింది. ముంబైలో కొత్త కేసుల నమోదు మూడు వారాల కనిష్ఠానికి పడిపోయాయి. శనివారం 5,888 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్‌ 4న నమోదైన 11,163 కేసులతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య 50 శాతానికి తగ్గింది.
 
మహారాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగానూ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత కొన్ని రోజులుగా దేశంలోనే మహారాష్ట్రలో అత్యధిక కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. శనివారం 67,160 కేసులు వెలుగులోకి వచ్చాయి. 
 
ముంబైలో నిన్నటితో పోలిస్తే కేసులు 20 శాతం తగ్గాయి. ఇక రోజువారీ పాజిటివిటీ రేటు సైతం 15 శాతానికి పడిపోయింది. అయితే, మరణాల సంఖ్యలో మాత్రం పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. ఈరోజు 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ప్రభుత్వ యంత్రాంగం కేసుల తగ్గుదలను విజయంగానే భావిస్తోంది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఫలిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మహారాష్ట్రలో ప్రస్తుతం కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. 
 
ప్రభుత్వం లాక్డౌన్‌ అని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. పరిస్థితులు మాత్రం పూర్తిస్థాయి లాక్డౌన్‌ను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజా కదలికలు తగ్గి కరోనా తగ్గుముఖం పట్టిందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు