ఫైజర్ టీకాలో అపశృతి : వ్యాక్సిన్ వేసుకున్న నర్సు మృతి.. ఎక్కడ?

బుధవారం, 6 జనవరి 2021 (10:45 IST)
ఫైజర్ ఫార్మా కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌లో అపశృతి దొర్లింది. ఈ టీకా వేసుకున్న నర్సు 48 గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పోర్చుగల్ దేశంలో జరిగింది. దీంతో ఫైజర్ టీకాపై ఇపుడు సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ఫైజర్/బయోఎన్‌టెక్ అభివృద్ధి చేసిన టీకాను వేయించుకున్నట్టు పోర్టోలోని పోర్చుగీస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీలోని పీడియాట్రిక్ విభాగంలో పనిచేసే నర్సు సోనియా అసెవెడో (41) ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించింది. అయితే, ఆ తర్వాత 48 గంటల్లోనే ఆమె మృతి చెందింది. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి.
 
కాగా, పోర్చుగల్ దేశంలో ఈ టీకాల పంపిణీ గత నెలలోనే ప్రారంభమైంది. ఈ క్రమంలో గత నెల 30న ఆమెకు టీకా ఇచ్చామని, ఆ తర్వాత సోనియాలో ఎలాంటి అవాంఛనీయ లక్షణాలు కనిపించలేదని, పూర్తి ఆరోగ్యంగా ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నారు. 
 
ఆమె మృతికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపాయి. సోనియా మరణం తమను కలచివేసిందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, ఫైజర్ టీకాను తొలి విడతలో మొత్తం 538కి ఇవ్వగా అందులో సోనియా ఒకరు.
 
తల్లి మరణంపై సోనియా కుమార్తె వనియా మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఆ ప్రాంతంలో కొంత ఇబ్బందిగా ఉందని మాత్రమే తనతో చెప్పిందన్నారు. అంతేకానీ, మరెలాంటి సమస్య లేదని, ఆరోగ్యంగానే ఉన్నట్టు చెప్పిందన్నారు. 
 
కాగా, మన దేశంలో కూడా ఈ కంపెనీ తయారు చేసిన టీకాలను అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ టీకాల పంపణీ ఈ నెల 13వ తేదీ నుంచి చేపట్టనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు